భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 10 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి వచ్చేస్తున్నది.. పల్లెకు పండగ శోభను తీసుకొస్తున్నది. బతుకుదెరువుకు ఊళ్లు దాటిన వారంతా తిరిగి స్వగ్రామాలకు వచ్చే వేళైంది. ఇంటిల్లిపాదీ సందడిగా గడిపే తరుణం వచ్చేసింది. అంతేనా.. కోడి పందేలకు బరులు సిద్ధమయ్యే సమయం ఆసన్నమైంది. భద్రాద్రి జిల్లాలోని ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లోని కొన్నిచోట్ల ఇప్పటికే బరులు సిద్ధమయ్యాయని సమాచారం. ఎన్ని చట్టాలు ఉన్నా.. ఎన్ని నిబంధనలు ఉన్నా.. ఏటా సంక్రాంతి సమయంలో పందేలు జరుగుతూనే ఉన్నాయి. ఢీ అంటే ఢీ అంటే పందెం రాయుళ్లు బరిలోకి కోళ్లను వదులుతున్నారు.
కోడి పందేలు అనగానే ఎవరికైనా ఆంధ్రానే గుర్తుకొస్తుంది. పూర్వకాలంలో జమీందార్లు, దొరలు ఎక్కువగా సంక్రాంతి సమయంలో వారు ఏలుతున్న ప్రాంతాల్లో కోడి పందేలు ఆడేవారు. ఈ పందేలను వారు ప్రతిష్ఠగా భావించేవారు. పందెంలో గెలిచిన కోడిని ప్రాణప్రదంగా చూసుకునేవారు. ఓడిపోయిన కోడిని వండి వార్చి తమ కుటుంబ సభ్యులు, వందీమాగధులకు పెట్టేవారు. ఆ పందేలు ఎలా.. ఎందుకు.. ఇప్పటికీ కొనసాగుతున్నాయో తెలియదు గానీ.. ఏటా క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉన్నది. జిల్లాలోని పాల్వంచ, దమ్మపేట, అశ్వారావుపేట, చండ్రుగొండ మండలాల ఏటా కోడి పందేలు జరుగుతున్నాయి. ఆంధ్రాప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ పందేలు ఎక్కువ. ఏటా సంక్రాంతి సమయంలో భద్రాద్రి జిల్లా నుంచి వందలాది మంది జూదరులు ఆంధ్రా ప్రాంతంలోని భీమవరం, రాజమండ్రి, వీఆర్ పురం, చింతూరు, కూనవరం, వేలేరుపాడు, కుక్కునూరుకు వెళ్తుంటారు. పందేలకు అధికారికంగా అనుమతులు లేకపోయినప్పటికీ రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గి అనధికారికంగా పందేలకు పచ్చ జెండా ఊపుతారనేది బహిరంగ రహస్యమే.
సంక్రాతి వచ్చిందంటే చాలు జిల్లా సరిహద్దుల్లోని సంతలు జోరుగా సాగుతాయి. అక్కడ పందెం కోళ్లకు మస్త్ గిరాకీ ఉంటుంది. సుమారు ఏడాది పాటు కోళ్లను సాది యజమానులు సంతల వద్దకు వచ్చి జూదరులకు విక్రయిస్తారు. ఒక్కో కోడి సంతలో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ధర పలుకుతుంది. కాస్త ఆర్థిక స్తోమత ఉన్న జూదరుడు కనీసం నాలుగు కోళ్లను కొనుగోలు చేస్తాడు. ప్రస్తుతం జిల్లాలో కాకి, కాకి డేగ, అబ్రాస్, సవలా, నెమలి, పెట్టమారి, పూల ఇలా రంగులను బట్టి అనేక పేర్లతో పందెం కోళ్లు దొరుకుతాయి.
బరుల వద్ద కోడి పందేలే జూదరులు వివిధ రకాల జూదాలు ఆడతారు. వీటిలో మట్కా ప్రధానమైనది. వీటిని నియంత్రించాల్సిన అధికారులు చూసీ చూడనట్లువ్యవహరిస్తుండడంతో ఐదు రోజుల పాటు జూదం ఆడి సొమ్ములు పోగొట్టుకుని తిరిగి ఇంటికి వస్తారు. జూదం ఆడి సంపాదించిన వారు వందల్లో ఒకరిద్దరు ఉంటారంతే. పందేలు రూ.10 వేల నుంచి మొదలై రూ.లక్షల వరకు వెళ్తుందనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. బరిలో నిలిపిన కోళ్ల యజమానులు, నిర్వాహకులే కాదు. బరి బయట నించుని పందేలను చూస్తున్న సాధారణ ప్రజలూ బయట పందేలు కాస్తారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సమయంలోనే కాక సాధారణ రోజుల్లోనూ గుట్టుచప్పుడు కాకుండా కోళ్ల పందేల స్థావరాలు నడుస్తాయి. ఏటా పదుల సంఖ్యలో పోలీసులు వాటిపై దాడులు చేస్తారు. జూదరులపై కేసులు సైతం నమోదు చేస్తారు. ఈసారి కూడా సంక్రాంతి మేనియా రానే వచ్చింది. ఇక పోలీసులు కోడి పందేల బరిలోకి దిగి కత్తి కడతారో.. కట్టడి చేస్తారో.. అనేది వేచి చూడాల్సిందే.