అశ్వారావుపేట, ఆగస్టు 9 : పేదలకు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న డీలర్లకు ప్రభుత్వం రెండింతల కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లావ్యాప్తంగా రేషన్డీలర్లు డబుల్ హ్యాపీతో ఉన్నారు. క్వింటాకు గతంలో రూ.70 ఉండగా ఏకంగా రెండింతలు పెంచుతూ రూ.140 ప్రకటించింది. అంతేకాకుండా హెల్త్కార్డులు అందించడానికి అంగీకరించింది. ‘రైతుబీమా’ తరహాలో రేషన్డీలర్లకు కూడా రూ.5 లక్షలు బీమా సౌకర్యం కల్పించనున్నది. దీనివల్ల జిల్లాలో పనిచేస్తున్న 442 మంది డీలర్లకు ప్రయోజనం కలగనున్నది. ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలోని రేషన్డీలర్లు సంబురాలు జరుపుకుంటున్నారు. కమీషన్ పెంచడమే కాకుండా ఆరోగ్యం కోసం హెల్త్కార్డు, తమ కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తూ బీమా కల్పిస్తున్న సీఎం కేసీఆర్, సహకరించిన మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి సంబురాలు జరుపుకున్నారు.
పేదల కడుపు నింపడంలో ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని పంపిణీ చేస్తున్న రేషన్డీలర్లకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న కమీషన్ను రెండింతలు పెంచడంతో డబుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. క్వింటా బియ్యం పంపిణీకి ప్రభుత్వం రూ.70 ఉన్న కమీషన్ను రూ.140లకు పెంచుతూ బుధవారం మంత్రులు హరీశ్రావు, కమలాకర్ ప్రకటించారు. సమస్యలపై రేషన్డీలర్ల సంఘాల నేతలతో ప్రభుత్వం తరఫున మంత్రులు మంగళవారం సచివాలయంలో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కమీషన్ పెంచి భద్రత కల్పించడమే కాకుండా రేషన్డీలర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి హెల్త్కార్డులు అందించడానికి అంగీకరించారు. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన డీలర్ల వారసులకు కారుణ్య నిమాయకం కింద డీలర్షిప్ మంజూరుకానున్నది. రాష్ట్రంలో రైతులు, నేత, గౌడ, తదితరులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా తరహాలోనే రేషన్డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు బీమా పథకం అమలు చేయనున్నది. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద కచ్చితమైన తూకం వేసే విధంగా వేబ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం రేషన్డీలర్లు తమ డీలర్షిప్ను ఏటా రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కాలపరిమితిని 5 ఏళ్లకు పెంచుతున్నది. రేషన్ డీలర్షిప్ వయో పరిమితినిని 40 నుంచి 50 ఏండ్లకు పెంచుతున్నది. ఎవరైనా డీలర్లు మరణిస్తే అంత్యక్రియల నిర్వహణకు తక్షణ సాయంగా రూ.10 వేలు ప్రభుత్వం ఇవ్వనున్నది.
సర్కార్ నిర్ణయంపై హర్షం
రేషన్డీలర్ల సమస్యల పరిష్కారం కోసం సర్కార్ తరఫున మంత్రులు హరీశ్రావు, కమలాకర్ తీసుకున్న నిర్ణయంపై జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా రేషన్ బియ్యాన్ని డీలర్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 23 మండలాల్లో 442 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో రేషన్ బియ్యం పంపిణీ పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం సాంకేతిక ఐరిష్, ఐపాస్, ఓటీపీ విధానాలను అమలు చేస్తున్నది. జిల్లాలోని 23 మండలాల్లో ఉన్న 442 రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం ప్రతి నెలా సుమారు 45 నుంచి 46వేల మెట్రిక్ టన్నుల బియ్యం పేదలకు అందిస్తున్నది. సమైక్య పాలనలో డీలర్ల కమీషన్ క్వింటాకు కేవలం రూ.20 ఉండేది. తెలంగాణ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదలతోపాటు బియ్యం పంపిణీ చేస్తున్న డీలర్ల కష్టాన్ని గుర్తించి రెండు దఫాల్లో కమీషన్ను రూ.140కు పెంచనున్నది. పెంచనున్న కమీషన్ ఎంతో సంతృప్తిగా ఉందని, అదనంగా హెల్త్కార్డులు, బీమా, వేబ్రిడ్జి ఏర్పాటు, డీలర్షిప్ రెన్యువల్ కాలపరిమితి పెంపు వంటి ఇతర సమస్యలను పరిష్కరించడం తమ కుటుంబాలకు పూర్తి ఆర్థిక భద్రత కలుగుతుందని రేషన్డీలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించింది
నామమాత్రపు కమీషన్తో రేషన్డీలర్లు పడుతున్న కష్టాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. కమీషన్ మాత్రమే పెంచడం కాకుండా ఇతర సౌకర్యాలు కల్పించనుండడంతో మా కుటుంబాలకు కనీస భద్రత, భరోసా లభించింది. ఒక సామాన్యుడికి కావాల్సిన సదుపాయాలను ప్రభుత్వం రేషన్డీలర్లకు అందించడం చాలా సంతోషంగా ఉంది.
– నాగుబండి పుల్లారావు, రేషన్డీలర్, అశ్వారావుపేట
442 మందికి ప్రయోజనం
రేషన్డీలర్లకు కమీషన్ పెంపుతోపాటు హెల్త్కార్డులు, బీమా, కారుణ్య నియామకాలు వంటి ప్రాధాన్యత కల్పించడం హర్షణీయం. జిల్లాలోని 442 మంది డీలర్లకు ప్రయోజనం కలుగుతుంది. రేషన్డీలర్లంతా సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కమలాకర్కు రుణపడి ఉంటారు. రేషన్డీలర్లకు స్వరాష్ట్రంలో పూర్తి న్యాయం జరిగింది.
– కొడాలి వెంకటేశ్వరరావు, రేషన్డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, అశ్వాపురం