మత సామరస్యం వెల్లివిరిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ముస్లింలు రంజాన్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉదయం నుంచే ఈద్గాలు, మసీదుల వద్దకు వెళ్లి ఈదుల్ ఫిత్ నమాజు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముస్లిం పెద్దలు ఖురాన్ సందేశాన్ని వినిపించారు. ఖమ్మం నగరంలోని గొల్లగూడెం ఈద్గాలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, సత్తుపల్లి, కల్లూరులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెల్దారుపల్లిలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, మణుగూరులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందులో హరిప్రియానాయక్, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు నమాజుల్లో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి రూ.వేల కోట్ల నిధులు విడుదల చేశారన్నారు.
-ఖమ్మం కల్చరల్, ఏప్రిల్ 22
భద్రాద్రి కొత్తగూడెం(నమస్తే తెలంగాణ)/ ఖమ్మం కల్చరల్, ఏప్రిల్ 22 : నెలరోజుల కఠిన ఉపవాస దీక్ష చేసిన ముస్లింలు భక్తిశ్రద్ధలు, నియమ నిష్టలతో రంజాన్ పర్వదినాన్ని శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముస్తాబైన ఈద్గాలు, మసీదులు, ప్రత్యేక ప్రదేశాలకు నూతన వస్ర్తాలు ధరించి ఉదయమే చేరుకున్న ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పరస్పరం ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. మత సామరస్యాన్ని చాటుతూ ముస్లిం సోదరులు స్నేహితులను ఇళ్లకు ఆహ్వానించి విందు ఇచ్చారు.
ఖమ్మంలోని గొల్లగూడెం ఈద్గా వద్ద ప్రార్థనలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణలో మత సామరస్యం పరిఢవిల్లుతున్నదని, ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్ వేల కోట్ల నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించేందుకు అల్లాహ్ దీవెనలు నిండుగా ఉండాలని ఆకాంక్షించారు. మణుగూరులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందులో హరిప్రియానాయక్, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.