ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా రాఖీ సందడి నెలకొన్నది. రక్షాబంధన్ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకొనేందుకు ప్రజలు సమాయత్తమయ్యారు. మార్కెట్లోకి వివిధ డిజైన్లతో రంగురంగుల రాఖీలు వచ్చేశాయి. రాఖీ దుకాణాలు, స్వీట్ షాపులు, కొనుగోలుదారులతో కిటకిట లాడుతున్నాయి. గురువారం కూసుమంచిలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మణుగూరులో ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మహిళలు రాఖీలు కట్టారు.
ఖమ్మం కల్చరల్, ఆగస్టు 11: ‘అన్నా చెల్లెల అనుబంధం.. జన్మజన్మలా సంబంధం..’ అంటూ ఆత్మీయతను చాటినా అన్నాచెల్లెళ్ల అనురాగానికి ఇంకా తక్కువ కొలమానమే అనిపిస్తుంది. అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో చివరి అక్షరం మేళవించిన ధైర్యం ‘అన్న’. అనురాగాప్యాయతల చిరునామా సోదరసోదరీమణుల అనుబంధం. రాఖీ అంటే సోదర సోదరీమణుల ప్రేమానురాగాలకు చిహ్నమే కాదు.. భరోసా ఇచ్చే రక్షా కంకణం. సోదరుల కుడి చేతి మణికట్టుపై సోదరీమణులు కట్టే ఆత్మయ బంధం. అనురాగ కవచం. ఈ కొద్దిపాటి దార బంధపు మహిమ అంత చిన్నదేమీ కాదు. ఎన్నో యుద్ధాలను ఆపిన, రక్తపాతాన్ని నిలువరించిన మంత్రదండం. అందుకే అది పెంచే సోదరభావం అనురాగాత్మీయతల ప్రతిబింబం.
స్థితికారుడైన విష్ణుమూర్తి జన్మనక్షత్రం శ్రవణం. ఈ నక్షత్రం పూర్ణిమ నాటి చంద్రుడితో కూడిన మాసం కాబట్టి శావ్రణమని శాస్త్ర వచనం. ఈ పవిత్ర నక్షత్రంలో పౌర్ణమి నాడు జరుపుకునే పండుగే రాఖీ పండుగ. ఈ పండుగను శ్రావణ పూర్ణిమ, రక్షా పూర్ణిమ, జంధ్యాల పున్నమి అనే పేర్లతో పిలుస్తారు. ఈ పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సమాయత్తమయ్యారు.
జంధ్యాల పున్నమి..
ఈ పండుగది ఆధ్యాత్మికంగా ప్రత్యేక విశిష్టత. శ్రావణ పౌర్ణమి అయిన ఈ రోజున ఏ శుభకార్యాలు తలపెట్టినా విఘ్నాలు లేకుండా విజయవంతమవుతాయని నమ్మకం. వేదోద్ధారకుడు, సర్వవిద్యలకు ఆధారమైన హయగ్రీవ జయంతి కూడా ఇదే రోజు. బ్రాహ్మణ యువకులు బ్రహ్మోపదేశం స్వీకరించేటప్పుడు యజ్ఞోపవీతధారణ చేస్తారు. అందుకే దీనిని ‘జంధ్యాల పున్నమి’ అని కూడా అంటారు.
రంగురంగుల రాఖీలు..
వారం రోజుల ముందు నుంచే మార్కెట్లోకి వివిధ డిజైన్లతో రంగురంగుల రాఖీలు వచ్చేశాయి. రాఖీల క్రయవిక్రయాలతో జిల్లా అనందాల హరివిల్లయింది. రాఖీ దుకాణాలు, స్వీట్ షాపులు, కొనుగోలుదారులతో సందడిగా మారాయి. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. ఆడపడుచులు పుట్టింటికి వచ్చేసి తల్లిదండ్రులు, అన్నాతమ్ముళ్లతో ఆనందంగా గడిపి సోదరులకు రక్షాబంధనాలు కట్టి ఆశీర్వచనాలు తీసుకుంటారు. ప్రస్తుతం ఈ సంప్రదాయం కొంత వెనుకబడింది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా సోదరులు వేర్వేరు ప్రాంతాల్లో ఉండడంతో ఈ పండుగ నాడు ఆన్లైన్ బంధాలను చాటుతున్నారు. సోదరీమణులు తమ అన్నాతమ్ముళ్లు ఉన్న ప్రాంతాలకు రాఖీలను వారం రోజుల ముందుగానే పోస్టులో పంపుతున్నారు. మరికొందరు ఆన్లైన్లో మాధ్యమాల్లో రాఖీ సందేశాలు, రాఖీ ప్రతులు పంపుతున్నారు. వాటిని అందుకున్న సోదరు కూడా తమ సోదరీమణులకు దీవెనలు అందిస్తున్నారు. ఖండాతరాలు దాటి స్థిరపడ్డాక భౌతికంగా దూరంగా ఉన్నా.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య సోదర బంధం మరింత బలపడుతోంది.
ప్రముఖులకు రాఖీ కట్టిన మహిళలు..
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మణుగూరులో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులకు మహిళలు, మహిళా ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టారు.