ఖమ్మం, మార్చి 22: ఎమ్మెల్సీ కవిత అరెస్టు ముమ్మాటికే అక్రమమేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆమెపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డిలతో కలిసి ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తప్పుడు కేసులు పెట్టిందని అన్నారు. ఈ కేసును టీవీ సీరియల్ మాదిరిగా రెండేళ్లు సాగదీసిందని, ఇప్పుడు ఎన్నికల వేళ దాన్ని తెరపైకి తెచ్చిందని అన్నారు. 2004 నుంచి 2014 వరకు కేవలం 200 కేసులను మాత్రమే నమోదు చేసిన ఈడీ.. 2014 నుంచి ఈ పదేళ్ల కాలంలో ఏకంగా 2,954పైగా కేసులు నమోదు చేసిందని అన్నారు. అసలు ఈ కేసుతో కవితకు ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. ఇందులో ఆమె బాధితురాలే తప్ప నిందితురాలు కాదని అన్నారు. న్యాయవ్యవస్థపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, ధర్మం తప్పకుండా గెలుస్తుందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా ఈ కేసును బయటకు వస్తారని అన్నారు.