ఖమ్మం కల్చరల్, మే 7 : సమాజ సేవకే అంకితమవుతానని, పేదలకు విద్య, వైద్య, ఉద్యోగరంగాల్లో సహాయం చేస్తానని రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని మొగిలి పాపిరెడ్డి కన్వెన్షన్ హాల్లో ఖమ్మంజిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు మొగిలి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. జిల్లా వాసిగా జిల్లా అభివృద్ధి, సంక్షేమానికి మరింత తోడ్పడతానన్నారు. జిల్లా నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యుడిగా ఆ హోదాకు మరింత గౌరవ ప్రతిష్ఠలు తీసుకొస్తానన్నారు.
ఎంపీగా వచ్చే వేతనాలు, రాయితీలను ప్రభుత్వ సహాయ నిధికే కేటాయించానని, అన్ని సామాజికవర్గాల పేదలకు సహాయం చేయడమే తన లక్ష్యమని తెలిపారు. జిల్లాలో రెడ్డి సంక్షేమ భవన్ నిర్మాణానికి కోటి రూపాయలకు తక్కువ కాకుండా ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎంతో చారిత్రాత్మక నేపథ్యమున్న రెడ్డి సామాజిక వర్గం అందరికీ ఆదర్శంగా ఉండాలని, వ్యాపార, వాణిజ్యరంగాల్లో అభివృద్ధి చెందిన వారు మరింత సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలన్నారు. వ్యాపారపరంగా తాను విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడుండే వేర్వేరు మతాల వారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్నిస్తున్నదన్నారు. అన్ని మతాలు, కులాల వారితో సమానంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్కరూ విలువలతో కూడిన జీవితాన్ని అనుసరించాలని సూచించారు.
సభకు అధ్యక్షత వహించిన ఖమ్మం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు మొగిలి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం వివరాలు, వారి అభివృద్ధి, సంక్షేమానికి చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను వివరించారు. రెడ్డి సంక్షేమ భవనం నిర్మాణం, రెడ్డి సామాజికవర్గంతోపాటు అన్ని కులాల్లోని పేదలకు విద్య, వైద్య సహాయం అందించడానికి దాతలు ముందుకురావాలని కోరారు. పలువురు వక్తలు మాట్లాడుతూ రెడ్డి కులస్తులంతా ఐక్యంగా ఉండి అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఆదర్శంగా ఉండాలన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హాజరై ఎంపీ పార్థసారథిరెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు మొగిలి శ్రీనివాసరెడ్డి, నాయకులు గజమాల, శాలువాలతో పార్థసారథిరెడ్డిని సత్కరించి మెమెంటో అందజేశారు.
సభలో సన్మానపత్ర సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉభయ ఖమ్మం జిల్లా నుంచి వేలాదిగా తరలివచ్చిన రెడ్డి బంధువులు, స్నేహితులు పార్థసారథిరెడ్డిని శాలువాలతో సత్కరించారు. సభలో సంఘం గౌరవ అధ్యక్షుడు ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, నూకల నరేశ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్రెడ్డి, శీలం వెంకటరెడ్డి, మంజునాథరెడ్డి, డాక్టర్ కె.సత్యనారాయణరెడ్డి, గాదె మాధవరెడ్డి, ప్రభాకర్రెడ్డి, డాక్టర్ రాఘవరెడ్డి, గురునాథరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.