భద్రాద్రి కొత్తగూడెం, జూలై 24 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం వ్యవసాయం: రెండు రోజుల పాటు తెరిపిచ్చిన వాన సోమవారం మళ్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లాను కమ్మేసింది. ఉభయ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా చర్ల మండలంలో 30 మి.మీ, పినపాక 28 మి.మీ, మణుగూరు 20 మి.మీ, దమ్మపేట 15 మి.మీ, దుమ్ముగూడెం 20 మీ.మీ, మిగిలిన మండలాల్లో 10-5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో అత్యధికంగా 40.8 మి.మీ, తిరుమలాయపాలెం మండలం బచ్చోడు 39.5 మి.మీ, రఘునాథపాలెం మండలం పంగిడి 37.5 మి.మీ, కొణిజర్ల మండలం గుబ్బగుర్తి 35.3 మి.మీ, ముదిగొండ మండలకేంద్రంలో 31 మి.మీ వర్షపాతం నమోదైంది. వాన కారణంగా ఖమ్మం నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత బస్టాండ్ సెంటర్, మయూరి సెంటర్, పాత డీఆర్డీఏ, పీఎస్ఆర్ రోడ్, కమాన్బజార్లో కాలువలు పొంగి రహదారిపై వరద నీరు చేరింది. వానలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ముమ్మరంగా సాగు చేపడుతున్నారు. ఈ సీజన్లో రైతులు ఖమ్మం జిల్లావ్యాప్తంగా 2,50 671 ఎకరాల్లో పంటలు సాగు ప్రారంభించారు. సరాసరి(డైరెక్ట్) పద్ధతిలో వరి 33,650 ఎకరాలు, నారు మడి పద్ధతిలో వరి 1.08 లక్షల ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులకు సలహాలు ఇస్తున్నారు. నారు మడుల్లో నీరు నిల్వలేకుండా, ఎప్పటికప్పుడు మళ్లించాలంటున్నారు. వారం పది రోజుల్లో వరి నాట్లు పూర్తి కానున్నాయి. పత్తి 1.52 లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. ప్రస్తుతం రైతులు పంటలో కలుపు తీయిస్తున్నారు. అలాగే మక్కలు 653 ఎకరాలు, పెసర 8,728 ఎకరాలు, చెరుకు 393 ఎకరాల్లో సాగవుతున్నది.