భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఖమ్మం నుంచి కొత్తగూడెం వచ్చే ప్రధాన మార్గంలోని సుజాతనగర్ మండలం వేపలగడ్డ వద్ద సింగరేణి యాజమాన్యం, ఆర్అండ్బీశాఖ సంయుక్తాధ్వర్యంలో రూ.45 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నాయి. పనులు 90శాతం పూర్తయినప్పటికీ వంతెన ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. ఇక్కడ రైల్వే లైన్ ఉండడంతో ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించేందుకు సింగరేణి యాజమాన్యం, రాష్ట్రప్రభుత్వం భాగస్వామ్యంలో వంతెన నిర్మించాలని సంకల్పించాయి. రెండేళ్ల క్రితం పనులు ప్రారంభం కాగా మొదట్లో పనులు వేగంగానే సాగాయి. ప్రస్తుతం అప్రోచ్ రోడ్డుతో పాటు చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
వంతెన కింద రైలు మార్గం ఉండడంతో రైల్వే సిబ్బంది రైళ్లు వచ్చే సమయంలో గేటు వేస్తున్నారు. ఇలా రోజుకు మూడు నాలుగు సార్లు గేటు మూసేయాల్సిన పరిస్థితి. దీంతో ఆ ప్రాంతంలో ప్రతిరోజూ ట్రాఫిక్ జామ్ అవుతున్నది. రైళ్ల రాక ఆలస్యమైతే ప్రయాణికులు గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రైల్వేమార్గం గుండా ప్రతిరోజూ సింగరేణి సంస్థ కేటీపీఎస్తోపాటు ఇతర ప్రాంతాలకు బొగ్గు రవాణా చేస్తుంది. రైల్వేలైన్ నుంచి కేవలం గూడ్స్ రైళ్లే వెళ్తాయి. రైళ్ల ప్రయాణంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇక అంతే సంగతులు. ఇక రైల్వే గేటు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి. వంతెన పనులపై ‘నమస్తే’ ఆర్అండ్బీ ఈఈ వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. కేవలం అప్రోచ్ రోడ్ పనులే మిగిలి ఉన్నాయని, పనులు పూర్తి చేసి రెండు నెలల్లో వంతెన ప్రారంభిస్తామని సమాధానమిచ్చారు.
బొగ్గు రవాణా చేసే రైలు బండ్లు వేళాపాళా లేకుండా సత్తుపల్లి నుంచి వస్తాయి. ఒక్కోసారి ఖాళీ వ్యాగన్లు సైతం వెళ్తుంటాయి. ఇటువంటప్పుడు గేటు పడితే ఎమర్జెన్సీ పనులు ఉన్న వారికి చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి లోడ్ లారీలు వచ్చినప్పుడు గేట్ పైన ఉన్న రెయిలింగ్ తగిలి లారీలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. రాత్రి సమయాల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైనా నాయకులు ఊరేగింపు పెడితే గంటలకొద్దీ నిలబడక తప్పడం లేదు. పైనుంచి వెళ్లేందుకు వంతెన కట్టినా ఇప్పటివరకు ప్రారంభించలేదు.
– బొడ్డు కేశవరావు, తెలంగాణ ఆటోడ్రైవర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు, సుజాతనగర్