రఘునాథపాలెం, మార్చి 25 : “కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కథానాయకులు.. వారు లేకుంటే మాకు ఈ పదవుల్లేవు..” అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలంలోని రఘునాథపాలెం, వీ వెంకటాయపాలెం, వేపకుంట్ల, చింతగుర్తి, గణేశ్వరం, చెరువుకొమ్ముతండా పంచాయతీల బీఆర్ఎస్ కార్యకర్తలతో శనివారం గణేశ్ గార్డెన్స్లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహూల్గాంధీపై పార్లమెంట్లో అనర్హత వేటు వేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రశ్నించేవారిని మోదీ సర్కార్ ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని, కార్యకర్తలు లేకుంటే మాకు ఈ పదవులే ఉండవని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండలంలోని రఘునాథపాలెం, వీ వెంకటాయపాలెం, వేపకుంట్ల, చింతగుర్తి, గణేశ్వరం, చెరువుకొమ్ముతండా పంచాయతీలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం శనివారం గణేశ్ గార్డెన్స్లో జరిగింది. దీనికి ఆరు గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చర్చించుకోవడానికి మాత్రమేకాక, పార్టీ కార్యకర్తలందరినీ ఆత్మీయంగా కలుసుకొని వారి సాధకబాధకాలు తెలుసుకునే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ ఆత్మీయ సమ్మేళనాలకు పిలునిచ్చారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటినుంచే కార్యకర్తలందరూ కార్యోన్ముఖులు కావాల్సి ఉందన్నారు. గ్రామాల్లో ప్రతిపక్షాలు చేసే తొర్రికూతలకు సమాధానం చెప్పాలని, వారి కుట్రలను పటాపంచలు చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులపై ‘ప్రగతిపై నివేదిక’ తయారు చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది మొత్తం ఎన్నికల సంవత్సరమని, అసెంబ్లీ మొదలుకొని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు వరుసగా ఉన్నందున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలన్నారు. జూన్, సెప్టెంబర్లో మరోమారు ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
రాహుల్పై అనర్హత వేటుకు ఖండన
కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్గాంధీని లోక్సభ నుంచి వెలివేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. ఇది ప్రశ్నించే గొంతులను నొక్కివేయడమేనన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అగ్రనాయకుడికే ఇలాంటి దుస్థితి ఎదురైతే ఇక దేశంలో ప్రజాస్వామ్యం ఏరకంగా ఉందో అర్థమౌతోందని ఆవేదన చెందారు. 20ఏళ్లు పార్లమెంటులో సభ్యుడిగా ఉన్న రాహుల్ పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా ప్రాంతీయ పార్టీల గతి ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను ఈడీ పేరుతో విచారణకు పిలిచి కేసీఆర్ కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయో అక్కడి ప్రతిపక్ష నాయకులపై సీబీఐ చేత దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చరిత్రనే తెలియదన్నారు. రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పొద్దునలేస్తే సీఎం కేసీఆర్పై అవాకులు చవాకులు పేలుతూ ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.
అనంతరం మంత్రి కార్యకర్తలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గ్రామాల వారీగా ముఖ్యకార్యకర్తలు, నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, జడ్పీటీసీ మాలోతు ప్రియాంక, ఎంపీపీ భూక్యా గౌరి, వైస్ ఎంపీపీ గుత్తా రవి, మంచుకొండ సొసైటీ చైర్మన్ మందడపు సుధాకర్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు మాదంశెట్టి హరిప్రసాద్, ఆత్మ చైర్మన్ భూక్యా లక్ష్మణ్నాయక్, మాజీ జడ్పీటీసీ కుర్రా భాస్కర్రావు, సర్పంచులు గుడిపుడి శారద, మెంటెం రామారావు, ధారా శ్యాం, యాసా నీలిమ, రావెళ్ల మాధవి, బానోతు మంగమ్మ, గ్రామశాఖ అధ్యక్షుడు తొలుపునూరి దానయ్య, బండి నాగేశ్వరరావు, భూక్యా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు పొట్లపల్లి రాజా, గుడిపుడి రామారావు, తాతా రఘురాం, నల్లమోతు శ్రీనివాసరావు, ఐల కాంతారావు, కూరాకుల నాగేశ్వరరావు, కుందేసాహెబ్, తగరం శ్రీను, కుతుంబాక నరేశ్ పాల్గొన్నారు.