రఘునాథపాలెం, జనవరి 6: మండలంలోని పువ్వాడ ఉదయ్నగర్ కాలనీలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణానికి చేస్తున్న యత్నాన్ని రెవెన్యూ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. పువ్వాడ ఉదయ్నగర్ పంచాయతీ కోయచలక రెవెన్యూ సర్వే నెంబర్ 192లో ప్రభుత్వం కొంతమందికి ఇళ్ల స్థలాలను కేటాయించింది. అయితే ఇళ్ల పట్టాలను మంజూరు చేయకపోవడంతో స్థలం ఖాళీగా ఉంది. అయితే ఆ స్థలం తమదేనంటూ శివాయిగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు శుక్రవారం ఉదయం అక్కడ ఇళ్ల నిర్మాణం కోసం ముగ్గులు పోసే ప్రయత్నం చేశారు. దీనిని పువ్వాడ నగర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారూ ఘర్షణ పడ్డారు.
విషయం తెలుసుకున్న తహసీల్దార్ నర్సింహారావు, గిర్దావర్ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నదని, దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు కేటాయించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు.