అశ్వారావుపేట, ఫిబ్రవరి 21: తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సంస్కరణలు, రక్షణ చర్యల ఫలి తంగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటైన వైద్యం సర్కారు దవాఖానల్లోనే లభిస్తోందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ రరావు పేర్కొన్నారు. అన్ని ఆసుపత్రులకంటే ప్రభుత్వ వైద్యశాలల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. స్వరాష్ట్రంలో ప్రజారోగ్యంపై దృష్టి సారించి రోగులకు మౌలిక సదుపాయాల కల్పించడంలో సఫలీకృతమైనట్లు చెప్పారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మంగళవారం సందర్శించిన ఆయన.. అక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలతో మాట్లాడారు.
ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆపరేషన్ల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే ఆర్థికంగా నష్టపోయామని, ఇప్పుడు సర్కారు ఆసుపత్రుల్లోనే ఆపరేషన్లు చేస్తుండడంతో ఆర్థిక చేయూత లభించిట్లయిందని మహిళలు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలకు పండ్లు, రొట్టెలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అనేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. మాతా, శిశు సంరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. అంతేగాక న్యూట్రిషియన్ కిట్టు, కేసీఆర్ కిట్లు వంటి అందిస్తూ తల్లీ బిడల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని గుర్తుచేశారు.
స్థానిక వైద్యశాలలో త్వరలోనే అన్ని రకాల ఆపరేషన్లూ ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని వివరించారు. అతి త్వరలోనే అశ్వారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 100 బెడ్ల ఆసుపత్రిగా సేవలు అందించబోతోందన్నారు. అలాగే డయాలసిస్ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించాలని వైద్యులను ఆదేశించారు. ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, ఆర్ఎంవో డాక్టర్ పూర్ణచంద్, సర్జన్ డాక్టర్ తిలక్, వైద్యులు అరుణ్కాంత్, భవ్య సుధ, బీఆర్ఎస్ నాయకుడు మందపాటి రాజమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.