ఖమ్మం, ఏప్రిల్ 20 : మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడి చేయాల్సిన అవసరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు లేదని, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. శనివారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్లు షేక్ మక్బూల్, దండా జ్యోతిరెడ్డి, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మైనార్టీ అధ్యక్షుడు తాజ్ఉద్దీన్, ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి, పగడాల నరేందర్, లీగల్ సెల్ నాయకుడు మేకల సుగుణారావు కాంగ్రెస్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక వారిని తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. పువ్వాడ కుటుంబం ఐదు దశాబ్దాలుగా ప్రజల మన్ననలను పొందుతున్నదని, వారి కుటుంబం తెరిచిన పుస్తకమని, అటువంటి కుటుంబంపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. పత్రికలో వచ్చిన నిరాధారమైన వార్తను పట్టుకుని కాంగ్రెస్ నాయకులు పువ్వాడపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో కడప, రాయలసీమ హత్యా రాజకీయాలకు అవకాశం లేదన్నారు. అనవసరంగా పువ్వాడపై ఆరోపణలు చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.