ఖమ్మం, ఏప్రిల్ 9 : వరంగల్లో ఈ నెల 27న పెద్ద ఎత్తున జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. ఖమ్మం జిల్లా నుంచి, ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. రజతోత్సవ సభ విజయవంతం కోసం ఖమ్మంలోని మమత హాస్పిటల్ క్యాంపస్లో బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో అజయ్ మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగే రజతోత్సవాన్ని జయప్రదం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. సభ అనంతరం ఆన్లైన్ మెంబర్షిప్ కోసం కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. 2000 సంవత్సరంలో పిడికెడు మందితో స్థాపితమైన బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) 2025 నాటికి పాతికేళ్లు పూర్తి చేసుకొని రజతోత్సవాలు జరుపుకుంటోందని అన్నారు.
2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన ఉద్యమసారథి కేసీఆర్.. ఎన్నో కుట్రలు, కుతంత్రాలు దాటుకొని చావునోట్లో తలపెట్టి మరీ 2014లో స్వరాష్ర్టాన్ని సాధించారని గుర్తుచేశారు. అలాంటి ధీశాలి సారథ్యంలో నడుస్తున్న పార్టీలో మనమందరమూ సభ్యులుగా ఉండడం గర్వకారణమని అన్నారు. 2014లో తెలంగాణ పాలనా పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపిందని గుర్తుచేశారు. సాగునీరు, తాగునీరు, 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి అద్భుత పథకాలన్నీ కేసీఆర్ మానసపుత్రికలేనని జ్ఞప్తికి తెచ్చారు.
అయితే, ఆరు గ్యారెంటీలంటూ ఊదరగొట్టి 15 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ గ్యారెంటీలన్నింటినీ అటకెక్కించిందని విమర్శించారు. మహిళలకు రూ.2,500, పెంచిన పింఛన్లు, తులం బంగారం, ఆడపిల్లలకు సూటీలు వంటి వాటి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇంకా 420 హామీలు ఇచ్చారని, వాటిని నేటికీ నెరవేర్చలేకపోయారని ధ్వజమెత్తారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. తెలంగాణ ప్రజలకు వెలుగు దివ్వె కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ నుంచి కేసీఆర్ పేరును చెరిపేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. అనంతరం రజతోత్సవ సభ పోస్టర్ను విడుదల చేశారు. బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, వీరూనాయక్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, కర్నాటి కృష్ణ, మక్బుల్, బచ్చు విజయ్కుమార్, ఖమర్, తిరుమలరావు, సుగుణారావు, మెంతుల శ్రీశైలం, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.