వైరా టౌన్, ఏప్రిల్ 16 : పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డి రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరారు. గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పును రేవంత్రెడ్డి ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే చేసి చూపించిందని విమర్శించారు. వైరా మండల కేంద్రంలోని కట్టా నరసింహారావు స్వగృహంలో గురువారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అజయ్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. వెలుగుమట్ల ప్రాంతంలో నిరుపేదలు కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చి దోచుకోవడమే వారి పరమావధిగా మారిందని ఎద్దేవా చేశారు.
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో 820 మంది ఇండ్లు కూల్చివేసి కంటితుడుపు చర్యగా కేవలం 310 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ ఇండ్లు పంపిణీ చేస్తామని అజయ్ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 33 శాతం మహిళా బిల్లు ప్రవేశపెడితే.. జిల్లాలో 15 నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉన్నదని, ఈ క్రమంలో వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ విషయంలోనైనా మాట్లాడే ధోరణి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నదని, కోటి రూపాయలు ఖర్చుపెట్టి వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న మాట వాస్తవమా? కాదా? అని సూటిగా ప్రశ్నించారు.
సీతారామ ప్రాజెక్టు అంచనాలు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.19 వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకోవడానికి సిద్ధమైందని, దీనిని అడ్డుకునేందుకు దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 19న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ప్రతీ కార్యకర్త సకాలంలో హాజరుకావాలని, ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు వస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కట్టా కృష్ణార్జున్రావు, వనమా విశ్వేశ్వరరావు, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరావు, అప్పం సురేశ్, వార్డు కౌన్సిలర్లు కట్టా స్వరూపరాణి, మాదినేని సునీత, దుర్గాప్రసాద్, దొంతబోయిన వెంకటేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, పోట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.