ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు పౌర సరఫరాలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని రోజుల్లో ఊపందుకోనున్నాయి. ధాన్యం సేకరణకు ఉమ్మడి జిల్లాలో 380 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. ఈ నెల 10 నుంచి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ధ్యానం సేకరణకు అధికారులు లక్షలాది గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు సిద్ధం చేశారు. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు పంపించనున్నారు. ధాన్యం ఎక్కువ సేకరిస్తే పొరుగు జిల్లాల్లోని మిల్లులకు తరలించనున్నారు. ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇప్పటికే ఇరు జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్ను ఆరా తీశారు. పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఖమ్మం, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తేతెలంగాణ)/ అశ్వారావుపేట: జిల్లాలో రైతులు పండించిన ధాన్యం సేకరించేందుకు పౌర సరఫరాలశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు నష్టపోకూడదని, ప్రభుత్వం పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నది. పొరుగు రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేయనున్నది. ఈ నెల 10 తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా 148 కేంద్రాలు ప్రారంభంకానున్నాయి. వానకాలంలో 56,523 హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు. 4.06 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచ నా వేస్తున్నారు. దీనిలో రైతులు 15 వేల టన్నులను విత్తనాల కోసం భద్రపరచుకుంటారని, మార్కెట్కు 2.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. వీటిలోనూ సుమారు 39 వేల టన్నుల ధాన్యం మిల్లులకు తరలిపోతే మిగతా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగో లు కేంద్రాలకు వస్తాయనుకుంటున్నారు. ధాన్యం సేకరణకు ఇప్పటికే 27 లక్షల గన్నీ బ్యాగులు, 6,400 టార్ఫలిన్లకు గాను 3,670 టార్ఫాలిన్లు సిద్ధం చేశారు.
కొనుగోలు కేంద్రాలు ఇలా..
మొత్తం 148 కేంద్రాల్లో ఐకేపీకి పరిధిలో ఆరు, పీఏసీఎస్ పరిధిలో 114, జీసీసీ పరిధిలో 28 కేంద్రాలు ఉన్నా యి. ఈనెల 10లోపు రైతులకు అందుబాటులో రానున్నాయి. ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు రూ 2,060, కామన్ రకానికి 2,040 చొప్పున ధాన్యం విక్రయించిన కొన్ని రోజుల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ అవుతాయి.
పక్కా నిఘా..
సరిహద్దు రాష్ర్టాల నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి రాష్ర్టానికి ధాన్యం తరలి రాకుండా ప్రభుత్వం బూర్గంపాడు, చర్ల, భద్రాచలం, అశ్వారావుపేట, దమ్మపేట, దుమ్ముగూడెం ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు కానున్నాయి. పోలీసులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ధాన్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయనున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు ధాన్యం తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయనున్నారు. ధాన్యం కొనుగోలు నుంచి, రైతుల ఖాతాల్లో డబ్బు జమయ్యే ప్రక్రియ నుంచి, మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ పూర్తిగా వచ్చే వరకు ప్రతి అంశాన్ని అధికారులు పర్యవేక్షించనున్నారు.
ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ విభాగం..
ఇంటెలిజెన్స్ విభాగంలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా పౌర సరఫరాల అధికారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, పీడీడీఆర్డీఏ, చెక్పోస్టు అధికారులు ఉంటారు. వీరు అక్రమాలకు తావు లేకుండా నిరంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తారు.
రైస్ మిల్లర్లకు సూచనలు..
ప్రతి రైస్ మిల్లర్ జిల్లా మేనేజర్తో అగ్రిమెంట్ చేయించుకోవాలి. ఫాం ఏ-2 రిజిష్టర్ను నిర్వహించాలి. దానిలో సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి వివరాలు, ధాన్యం ఆడించిన వివరాలు, సీఎంఆర్ డెలివరీకి సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. రైస్ మిల్లర్ల ప్రెసిడెంట్ చొరవ తీసుకుని మిల్లుల వద్ద సకాలంలో ధాన్యం దిగుమతి అయ్యే విధంగా చూడాలి.
కొనుగోళ్లపై మంత్రి అజయ్ దృష్టి..
ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఉభయ జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్ను అప్రమత్తం చేస్తున్నారు. పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. టార్ఫాలిన్లు, గన్నీ బ్యాగులను సిద్ధం చేయాలన్నారు.
ఖమ్మం జిల్లాలో..
ధాన్యం కొనుగోళ్లకు కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను సిద్ధం చేస్తున్నారు. వానకాలంలో రైతులు జిల్లావ్యాప్తంగా 1,15,518 హెక్టార్లలో వరి సాగు చేశారు. 5.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీనిలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేసి, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 232 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. సొసైటీల పరిధిలో 152, ఐకేపీ పరిధిలో 48, వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో నాలుగు, డీసీఎంఎస్ పరిధిలో 28 కేంద్రాలు ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రతి కేంద్రంలో నిర్వాహకులకు ట్యాబ్లు అందాయి. జిల్లావ్యాప్తంగా 51 రైస్మిల్లులు ఉండగా వీటిలో బాయిల్డ్ రైస్మిల్లులు ఉన్నాయి. మొత్తం 57 రైస్మిల్లులకు ధాన్యం తరలనున్నది. ధాన్యం సేకరణను అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నిరంతరం పర్యవేక్షించనున్నారు. ధాన్యం ఎక్కువగా వస్తే జిల్లాకు సమీపంలో ఉన్న కోదాడ, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల్లోని రైస్మిల్లులకు ధాన్యం తరలించనున్నారు. ఇప్పటికే సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, పాలేరు, నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో వరికోతలు ప్రారంభమయ్యాయి.
ఒక్కొక్కరి విధులు ఇలా..
జిల్లా పౌర సరఫరాల అధికారి: ధాన్యం కొనుగోళ్లపై జిల్లాస్థాయి అధికారులను సమన్వయపరుస్తారు. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా చూస్తారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లను అందుబాటులో ఉంచుతారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యేలా చూస్తారు. కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి: రైతుబంధు సమితి కమిటీలు, వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటారు. ధాన్యానికి మంచి ధర వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ ప్రమాణాలను తెలియజేస్తారు. ఏవో, ఏఈవోలను సమన్వయం చేస్తూ రైతులకు అందుబాటులో ఉండేలా చూస్తారు. ఏవో, ఏఈవోలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చే తేదీలను తెలియజేస్తారు.
జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్: ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం శుభ్రపరిచే యంత్రం, తేమ శాతం కొలిచే యంత్రం, తూకం కోసం వినియోగించే కాంటా, టార్ఫలిన్లు, వేయింగ్ మెషిన్లు అందుబాటులోఉండేలా చర్యలు తీసుకుంటారు.
జిల్లా రవాణాశాఖ అధికారి: అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లను సమన్వయం చేస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రైస్ మిల్లులకు తరలింపును పర్యవేక్షిస్తారు.
దళారులను నమ్మొద్దు
రైతులు పండించిన ప్రతి గిం జనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దళారులను నమ్మి మోసపోవద్దు. ప్రైవేటుగా అమ్మి నష్టపోవద్దు. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధరే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమలవుతుంది. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తాం.
– చిన్నంశెట్టి సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షుడు, అశ్వారావుపేట
10 నుంచి కొనుగోళ్లు..
ఈ నెల 10 నుంచి జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. కేంద్రాల్లో రైతులకు తగిన వసతులు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తాం. కొనుగోళ్లు పారదర్శకంగా ఉంటాయి. ఎలాంటి అవకతవకలకు తావు ఉండదు.
– తినాథ్, డీసీఎస్వో, కొత్తగూడెం
సర్వం సిద్ధం..
ఈనెల 10 నుంచి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయి. గన్నీ బ్యాగులతో సహ ధాన్యం సేకరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం సేకరించిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయిస్తాం.
– మధుసూదన్, అడిషనల్ కలెక్టర్, ఖమ్మం