ఖమ్మం, మార్చి 15 : ఖమ్మం అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో ఖమ్మం తెలంగాణలోని అన్ని ప్రాంతాల కంటే ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన నాయకులతో కలిసి మాట్లాడారు. లకారం ట్యాంక్బండ్ వద్దకు వస్తే అభివృద్ధిపై సినిమా చూపిస్తామన్నారు. లకారం ట్యాంక్బండ్, ఐటీ హబ్, రోడ్ల విస్తరణ తదితర ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని, ఇవి కండ్లకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. బ్యాంక్లను దోపిడీ చేసే వారిపై కేసులు పెట్టకుండా ఎలా ఉంటారని అన్నారు.
కొత్త కలెక్టరేట్ వద్ద పొంగులేటి వర్గీయులకు 20ఎకరాలు ఉందని, ఖమ్మంలో జరిగిన అభివృద్ధి వల్లే అది ఎకరం రూ.5 కోట్లు అయ్యిందన్నారు. ఎలాంటి ఎజెండా లేని వారికి మాట్లాడే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్లో వర్గాలు లేవని అందరూ కేసీఆర్ వర్గమేనని మేయర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ మాట్లాడుతూ స్వర్ణకుమారి తిరుమలాయపాలెం వస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. రాజకీయ నిరుద్యోగులు మాట్లాడితే సహించమన్నారు. బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ పొంగులేటి వర్గీయులు బీఆర్ఎస్ నాయకులను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బీజేపీ ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని, మరో 10 లక్షలకు పైగా ప్రవేటు సెక్టార్లో ఉద్యోగాలు కల్పించిందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్ మాట్లాడుతూ వ్యక్తిగత దాడులు చేయడం సరికాదన్నారు. వైరా నియోజకవర్గ నాయకుడు పసుపులేటి మోహన్రావు, కల్లూరు మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, బోనకల్ మాజీ అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు మాట్లాడారు. సమావేశంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ కమర్తపు మురళి, పంబి సాంబశివరావు, బంకా మల్లయ్య, మారోజు సురేశ్, మోదుగు పుల్లారావు పాల్గొన్నారు.