ఖమ్మం, అక్టోబర్ 28 : వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పువ్వాడ అజయ్కుమార్ గెలుపును కాంక్షిస్తూ నవంబర్ 5వ తేదీన ఖమ్మం నగరంలో సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని, కనీవినీ ఎరుగని రీతిలో జన సమీకరణ చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్, మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు, వైరా బీఆర్ఎస్ అభ్యర్థి మదన్లాల్ పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం నగరంలోని తెలంగాణభవన్లో కార్పొరేటర్లు, ముఖ్యనాయకులతో నిర్వహించిన సన్నాహాక సమావేశంలో వారు మాట్లాడారు. సభకు లక్ష మందికి తగ్గకుండా ప్రజలను తరలించాలన్నారు. జిల్లాకేంద్రంలో జరుగుతున్న సభ కనుక మిగతా నియోజకర్గాలపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రతి డివిజన్ నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలను తరలించాలని సూచించారు.
సభ పూర్తయ్యే వరకు ప్రజలు సభ నుంచి వెళ్లకుండా కార్యకర్తలు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను అందించాలని కోరారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటును ప్రతిష్ఠాత్మకంగా భావించి ప్రచారం చేయాలని సూచించారు. కార్పొరేటర్ నుంచి బూత్కమిటీల ప్రతినిధులంతా సమన్వయంతో వ్యవహరిస్తూ ఓటర్లను తరుచుగా కలుస్తూ ఉండాలన్నారు. ఈక్రమంలో ఖమ్మం అభివృద్ధికి సీఎం కేసీఆర్ అందించిన సహకారాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఎవరైతే లబ్ధి పొందారో వారిని కలుసుకుని మద్దతు కోరాలన్నారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఖమ్మాన్ని సుందరీకరించిన తీరును అందరికీ అర్థమయ్యేలా చెపుతూనే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత నాలుగేండ్ల క్రితం ఖమ్మానికి, ఇప్పుడున్న నగరానికి వ్యత్యాసం ఏమిటో తెలియజేయగలిగితే ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి పడే అవకాశం ఉండదని వ్యాక్యానించారు. డివిజన్లలో పార్టీపై అభిమానం ఉండికూడా ఏదైనా కారణంచేత బయటికిరాని సానుభూతిపరులను, క్రియాశీల నాయకులను గుర్తించి పకడ్బందీగా ప్రచారం చేయాలని ఆదేశించారు.
ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పువ్వాడ అజయ్ గెలుపు ఎన్నడో ఖాయమైందని ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కార్పొరేటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాయమాటలతో కాంగ్రెస్ ముందుకు రాబోతున్నదని, దాని తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అని, ప్రతిఒక్కరికీ మంచి భవిష్యత్ ఉంటుందన్న నిజాన్ని మదిలో పెట్టుకుని ప్రతిఒక్కరూ పార్టీకోసం పనిచేయాలన్నారు. సభ విజయవంతానికి ఎవరికి వారు ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. రఘునాథపాలెం మండలంలోని అన్ని గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చేలా చూడాలన్నారు. సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఆర్జేసీ కృష్ణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, పగడాల నాగరాజు, నాయకులు తోట రామారావు, జానీ, శీలంశెట్టి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.