శ్రీరాంపూర్/రామగిరి, జూలై 8 : సింగరేణి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల వైద్య సేవల కోసం హైదరాబాద్లోని నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లను డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్ బలరామ్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, జీఎం(కో ఆర్డినేషన్) ఎం సురేశ్ శనివారం ప్రారంభించారు. ఔట్ పేషెంట్ బ్లాక్, మిలీనియం బ్లాక్, స్పెషాలిటీ బ్లాకులో సింగరేణీయుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓపీ కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ బీరప్ప మాట్లాడుతూ.. మెరుగైన వైద్య సేవల కోసం రెఫర్ చేయబడిన సింగరేణి కార్మికులు, సీపీఆర్ఎంఎస్ మెడికల్ కార్డు కలిగిన విశ్రాంత కార్మికులు అడ్మిషన్ కౌంటర్ల వద్ద అందరితో సమానంగా వేచిచూడాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా డాక్టర్లను సంప్రదించేందుకు, అడ్మిట్ అయ్యేందుకు ప్రత్యేకంగా సింగరేణి కౌంటర్లను తెరిచినట్లు తెలిపారు. సింగరేణి విస్తరించిన సుదూర ప్రాంతాల నుంచి వైద్య సేవలకు వస్తున్న కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
సింగరేణి ఉద్యోగులంటే తమ ఉద్యోగులనే భావనతో సేవలందిస్తున్నామని తెలిపారు. నిమ్స్లో అన్ని వైద్య విభాగాల్లో ఆధునిక వైద్య సేవలు అందించడం కోసం అత్యాధునిక యంత్రాలను సమకూర్చుకున్నామని చెప్పారు. అనుభవజ్ఞులైన వైద్యులతో సేవలందిస్తున్నామని తెలిపారు. అనంతరం డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పర్సనల్) ఎన్ బలరామ్ మాట్లాడుతూ.. నిమ్స్లో సింగరేణి కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. నిమ్స్కు వచ్చిన రోగులు, వారి సహాయకుల తాతాలిక వసతి కోసం ప్రత్యేక బిల్డింగ్ను సైతం కేటాయించడం సంతోషకరమన్నారు. దీనిని త్వరలోనే వసతికి అనుకూలంగా మారుస్తామని తెలిపారు. ఇతర వైద్యశాలతో పోల్చితే నిమ్స్లో అతి తకువ రేటుతో అన్ని రకాల వైద్య సేవలను అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ద్వారా అందిస్తున్నారని చెప్పారు. ఈ సేవలను ఉద్యోగులు ఎంపిక చేసుకోవాలని, మెరుగైన వైద్య సేవలు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీఎం కోఆర్డినేషన్ ఎం సురేశ్, సింగరేణి డిప్యూటీ సీఎంవో డాక్టర్ బాలకోటయ్య, సింగరేణి పీఆర్వో ఎస్ శ్రీకాంత్, డీఎంఎస్లు డాక్టర్ కేవీ కృష్ణారెడ్డి, డాక్టర్ లక్ష్మీభాసర్, ఆర్థిక విభాగం అధికారులు శ్రీధర్, వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ మోహన్, పీఆర్వో లక్ష్మి, మీడియా రిలేషన్ ఆఫీసర్ సత్యాగౌడ్ పాల్గొన్నారు.