– రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
– రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వినతి
కారేపల్లి, నవంబర్ 05 : ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు వర్తక, వ్యాపార కేంద్రంగా ఉన్న ఖమ్మంలో పలు సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని, కొవిడ్ వ్యాప్తి సమయంలో జిల్లాలో రద్దు చేసిన పలు ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో రైల్వే మంత్రిని కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైల్వే సమస్యలపై వినతి పత్రం అందజేశారు. బిహార్, ఢిల్లీ, రాజస్థాన్ వైపు వెళ్లే ప్రయాణికులకు సౌలభ్యంగా గయా మాస్, స్వర్ణ జయంతి, జైపూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఖమ్మంలో నిలపాలని విజ్ఞప్తి చేశారు. ఇరుముడి ధరించి, అయ్యప్ప సన్నిధానం శబరిమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఖమ్మంలో కేరళ ఎక్స్ ప్రెస్ కు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని కోరారు.
గార్ల రైల్వే స్టేషన్లో శాతవాహన, ఇంటర్ సిటీ రైళ్లను ఆపడంతో పాటు స్టేషన్ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొవిడ్ వ్యాప్తి సమయంలో ఉమ్మడి జిల్లాలో రద్దు చేసిన కాజీపేట – విజయవాడ, డోర్నకల్ – భద్రాచలం, కాజీపేట – మణుగూరు, కొల్లాపూర్ ప్యాసింజర్ రైళ్లను పునరుద్దరించాలని, కాకతీయ ప్యాసింజర్ రైలుకు తడికలపూడి, చీమలపాడు, బేతంపూడి స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం కల్పించాలని వినతి పత్రంలో కోరారు. కాజీపేట-విజయవాడ ప్యాసింజర్ రైలును తిరుపతి వరకు పొడిగించి తిరుమల వెళ్లే భక్తుల ఇబ్బందులు తొలగించాలన్నారు. భద్రాచలం రోడ్ నుండి సికింద్రాబాద్ కు ఉదయం పూట మరో రైలును మంజూరు చేయాలని ఎంపీ రవిచంద్ర కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.