కూసుమంచి, మార్చి 22 : జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ పోలీసు అధికారులను ఆదేశించారు. నాయకన్గూడెం టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టును, పెరికసింగారం, జుఝల్రావుపేట, నాయకన్గూడెం, ఈశ్వరమాధారం, రాజుపేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్పోస్టు వద్ద రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డిని.. రిజిస్టర్ మెయింటెనెన్స్, వాహన తనిఖీలు ఎలా చేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. తనిఖీ చేసిన ప్రతి వాహనం నెంబర్ను నమోదు చేయాలని, వీడియోలు తీస్తూ 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యుత్, తాగునీరు, మిషన్ భగీరథ నీరు రాని కేంద్రాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఓటరు జాబితాను తనిఖీ చేసి.. బీఎల్వోల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కు తెలిసే విధంగా వాల్ పెయింటింగ్ వేయించి పోలింగ్ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. పోలింగ్ సమయంలో గతంలో ఏమైనా ఇబ్బందులు కలిగాయా? అనే విషయాలను అధికారులు, ఉపాధ్యాయులు, ఎస్సై కిరణ్ను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ర్యాంప్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాలేరు రిటర్నింగ్ అధికారి ఆర్.రాజేశ్వరి, పీఆర్ ఎస్ఈ చంద్రమౌళి, ఈఈ వెంకటరెడ్డి, ఎంపీడీవో వేణుగోపాల్రెడ్డి, డీఈ వేణుగోపాల్, తహసీల్దార్ సురేశ్, ఏవో వాణి, ఉద్యానవన అధికారి అపర్ణ, ఎస్సై కిరణ్ తదితరులు పాల్గొన్నారు.