బోనకల్లు, జూన్ 19 : బ్రాహ్మణపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడులు, దౌర్జన్యాలను తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బాధితులు, మహిళలు బోనకల్లు పోలీస్స్టేషన్ను ఆశ్రయించి వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని గురువారం ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మడుపల్లి వెంకటేశ్వర్లు వారం రోజుల క్రితం ఆటోలో వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పెద్దప్రోలు సైదులు, అతడి కుమారుడు కార్తీక్లు ఆటోను ఆపి ఇనుప రాడ్తో వెంకటేశ్వర్లుపై దాడి చేశారు.
దీంతో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీనిపై ప్రశ్నించిన వెంకటేశ్వర్లు తల్లి రాధమ్మపై కూడా దాడికి దిగడంతో కుటుంబ సభ్యులు మంగళవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పోలీసులు వారిని పిలిపించి విచారణ చేపట్టలేదని బాధితులు ఆరోపించారు. దీంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు, బాధిత కుటుంబ సభ్యులు గురువారం బోనకల్లు పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. కాంగ్రెస్ నాయకులతో తమకు ప్రాణభయం ఉందని, వారి నుంచి రక్షణ కల్పించాలని ఎస్సై వెంకన్నను వేడుకున్నారు.
పూర్తిస్థాయి విచారణ చేసి, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్సై హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, మధిర ఏఎంసీ మాజీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ జెర్రిపోతుల రవీందర్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వంగాల కృష్ణ మాట్లాడుతూ వెంకటేశ్వర్లు, అతడి తల్లిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వంగాల సీత, బీఆర్ఎస్ నాయకులు రామిశెట్టి రవికుమార్, గుడిద శ్రీరామ్, ఎనమద్ది శ్రీనివాసరావు పాల్గొన్నారు.