ఖమ్మం/ఖమ్మం వ్యవసాయం, మార్చి 2 : నగరంలోని వ్యవసాయ మార్కెట్ పునర్నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. మోడల్ మార్కెట్కు సంబంధించి ఇప్పటికే బ్లూప్రింట్ను రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు రూపొందించగా.. దీనిపై హైదరాబాద్లో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం సమీక్ష చేశారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ జీ.లక్ష్మీబాయి, ఇతర అధికారులతో మోడల్ మార్కెట్ నిర్మాణంపై చర్చించారు. మార్కెట్కు ప్రస్తుతం వస్తున్న మిర్చి బస్తాలు, కల్పించిన సదుపాయాలు, భవిష్యత్లో వచ్చే పంట ఉత్పత్తులు, మౌలిక వసతులు తదితర అంశాల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నూతన మార్కెట్ నిర్మాణంపై లక్ష్మీబాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. జాతీయ, అంతర్జాతీయంగా వివిధ రకాలుగా మిర్చి వాడకం పెరుగుతుండడం వల్ల భవిష్యత్లో మిర్చి పంట విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం 2 లక్షల బస్తాల వరకు కొనుగోలు, అమ్మకాలకు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి వసతులు కల్పించే విధంగా నిర్మాణం చేపట్టాలని మంత్రి ఆదేశించారు. 16.80 ఎకరాల్లో మార్కెట్ పునర్నిర్మాణం జరగాలని, ఇందుకోసం రూ.102 కోట్లు ఖర్చు అవుతున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రికి వివరించారు. మే మొదటి వారంలోగా డిజైన్ మొదలు పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దశలవారీగా పనులు పూర్తి చేయడానికి కాల వ్యవధితో కూడిన రోడ్ మ్యాప్ను రూపొందించాలని మంత్రి సూచించారు.