మామిళ్లగూడెం, ఫిబ్రవరి 13: పోడు భూముల పట్టాల జారీకి చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎఫ్ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోడు భూముల పట్టాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోడు భూముల పట్టాల విషయమై ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దరఖాస్తుల క్షేత్ర పరిశీలన చేసి, సర్వే ప్రక్రియ పూర్తి చేసినందుకు అధికారులను అభినందించారు.
పట్టాలపై ఇంటిపేరు, పేర్లలో ఒత్తులు, పొల్లులు, అచ్చు తప్పులు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. సింగరేణి, సత్తుపల్లి, కొణిజర్ల, కామేపల్లి, పెనుబల్లి, రఘునాథపాలెం మండలాల్లో ఎకువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అర్హులైన ప్రతిఒకరికి పట్టాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డీఆర్డీవో విద్యాచందన, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.