రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం దళితుల స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నదని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. ఇలాంటి పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందనుండడంతో వారే ఇతరులకు పని కల్పించే స్థాయికి చేరుకుంటారన్నారు. ఈ పథకం ద్వారా దళితులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఎక్కడైనా వ్యాపారం చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు ఓ సామాజిక విప్లవమని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాములునాయక్
అభివర్ణించారు.
“దళితులల్లో ఆత్మగౌరవాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మెదిలిన అద్భుతమైన పథకం దళితబంధు. ఆయన అభినవ అంబేద్కర్లా ప్రజాసంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. దళితులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు”. అని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. వైరా నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలుకు తీసుకుంటున్న చర్యలు, లబ్ధిదారుల ఎంపిక, పథకంపై అవగాహన కల్పిస్తున్న తీరు తదితర అంశాలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. దళితబంధు పథకం దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని, వారి ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్నదన్నారు.
– ఖమ్మం, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నమస్తే : నియోజకవర్గంలో దళితబంధు అమలుకు తీసుకుంటున్న చర్యలేమిటి?
ఎమ్మెల్యే : నియోజకవర్గంలో తొలివిడతగా 100 దళిత కుటుంబాలకు ‘దళితబంధు’ అమలు చేయనున్నాం. ఇందుకు సంబంధించి నియోజకవర్గంలో అర్హులైన 100 కుటుంబాలను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించాం. అధికారులు ఇప్పటికే దళిత కుటుంబాల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.
నమస్తే : ఈ పథకంపై దళితులకు ఎలా అవగాహన కల్పిస్తున్నారు?
ఎమ్మెల్యే : వైరా నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే దళితబంధు అమలు కోసం ప్రత్యేకాధికారులను నియమించింది. వారు దళితులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నారు. యూనిట్లు ఎంపిక, ఉపాధి మార్గాలపై వారికి వివరిస్తున్నారు. ఎస్సీల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా దళితబంధు పథకాన్ని రూపొందించాలని సంకల్పించాం. ఎంపిక చేసిన ప్రతి దళిత కుటుంబం రూ.10 లక్షలతో వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. దీనిపై దళితులకు అవగాహన కల్పిస్తున్నాం.
నమస్తే : దళితబంధులో యూనిట్ల ఏర్పాటు ఎలా ఉండనుంది?
ఎమ్మెల్యే : దళితులు తమకు నచ్చిన వ్యాపారం చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఈ పథకంలో ఉంది. లబ్ధిదారులు ఎక్కడైనా వ్యాపారాన్ని నిర్వహించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. వైరా నియోజకవర్గంలో దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారుల డిమాండ్ను బట్టి వ్యాపారం చేస్తే లాభదాయకంగా ఉంటుంది.
నమస్తే : లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఎలా ఉండనుంది?
ఎమ్మెల్యే : తొలిదశలో నియోజకవర్గానికి 100 కుటుంబాలకు దళితబంధు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన దళిత ఉద్యమకారులు, నిరుపేద దళితులకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని అధికారులను కోరాం. దళితబంధు పథకం అమలుతో దళితులు ముఖ్యమంత్రి కేసీఆర్లో దేవుడిని కొలుస్తున్నారు. గతంలో ఏప్రభుత్వమూ ఈ తరహా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు.
నమస్తే : దళితబంధు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు?
ఎమ్మెల్యే : దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో దళితబంధు అమలు చేస్తున్నారు. దశాబ్దాల తరబడి ఆర్థిక, అసమానతలతో ఇబ్బంది పడుతున్న దళితులకు ఈ పథకం ఒక వరం. వ్యాపారం నిర్వహించే సామర్థ్యం, శ్రమించే శక్తి ఉన్నా.. పెట్టుబడి లేక ఎంతో మంది దళితులు ప్రగతి సాధించలేకపోయారు. ఈ పథకం అమలుతో వ్యా పారం చేయాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునేవారి కోరిక తీరనున్నది. దళితుల అభ్యన్నతికి ఈ పథకం దోహదం చేస్తుంది.