ఖమ్మం, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం పథకం కోసం గురువారం జిల్లావ్యాప్తంగా ప్రజాపాలన గ్రామసభలు ప్రారంభమయ్యాయి. ఒకరోజు ముందుగానే గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, సిబ్బంది, అంగన్వాడీలు నెంబర్లు వేసిన దరఖాస్తు ఫారాలను ఇంటింటికీ వెళ్లి అందజేశారు. ఉదయం 8గంటలకే గ్రామసభలు ప్రారంభమయ్యాయి. సభల నిర్వహణ, ప్రజల ఇబ్బందులు, ఇతర సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఖమ్మం నగరంతోపాటు, నేలకొండపల్లి, ముదిగొండ మండలంలో పర్యటించిన వారు అధికారులకు అవసరమైన సూచనలతోపాటు, ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన గ్రామసభల్లో సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు హాజరయ్యారు, వీరితోపాటు ఆయా గ్రామాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా గ్రామసభలు ఏర్పాటు చేశారు. ఒక టీంకు తహసీల్దార్, మరో టీంకు ఎంపీడీవో నేతృత్వం వహించారు.
జిల్లావ్యాప్తంగా ఆయా మండలాల పరిధిలో ముందుగా ఏర్పాటు చేసిన ప్రణాళిక ప్రకారం ప్రజాపాలన గ్రామసభలు జరిగాయి. ప్రతి మండలంలో రెండు టీంలు, నాలుగు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఖమ్మం నగరంలోని ఆయా డివిజన్లో జరిగిన గ్రామసభల ఏర్పాట్లను కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్సురభితో కలిసి పర్యవేక్షణ చేశారు. నేలకొండపల్లి మండలం ఆరెగూడెం గ్రామసభలో వారు పాల్గొని ప్రజలు, అధికారులకు పలు సూచనలు చేశారు. ఖమ్మంరూరల్ మండలం బారుగూడెంలో పాలేరు నియోజకవర్గ స్పెషలాఫీసర్ రాజేశ్వరి గ్రామసభను ప్రారంభించారు. బోనకల్లో జరిగిన గ్రామసభలో డీఆర్డీవో విద్యాచందన, మధిర మున్సిపాలిటీ ఏడోవార్డులో మున్సిపల్ చైర్మన్ మొండితోక లలిత, వైరా మండలం కోష్టాల గ్రామంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ పాల్గొన్నారు. ముదిగొండ మండలం ఖానాపురం గ్రామసభ ఏర్పాట్లను కలెక్టర్, సీపీలు పర్యవేక్షణ చేశారు. వైరా పట్టణంలోని ఒకటో వార్డు గ్రామసభలో మున్సిపల్ కమిషనర్ నూతకాని జైపాల్, కమిషనర్ కరుణాకర్ పాల్గొన్నారు. మధిర మండలం నక్కలగుంపు గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు హాజరయ్యారు. సత్తుపల్లి మండలం చోడవరం గ్రామసభలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పథకాలకు దరఖాస్తు ఎలా చేసుకోవాలో సరైన అవగాహన లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏమి జతపచాలి అనే విషయంలో అయోమయానికి గురయ్యారు. ఉదయం సభల్లో కొందరు దరఖాస్తుఫారంతోపాటు అన్ని ధ్రువీకరణ పత్రాలు జతపరిచి అందజేశారు. దీంతో మిగిలిన వారు పూర్తిస్థాయిలో అవసరమైన ధ్రువీకరణ పత్రాలు తమవద్ద లేవనే ఉద్దేశంతో వెనుదిరిగిన పరిస్థితి కనపడింది. అప్పటికప్పుడు జిరాక్స్ పత్రాలను తీసుకొచ్చేందుకు జిరాక్స్ సెంటర్లకు ప్రజలు బారులుదీరారు. ఇకపోతే రేషన్కార్డు కోసం ఆప్షన్ లేకపోవడంతో చాలామంది అదే విషయంపై అధికారులను సంప్రదించారు. వాటికి సంబంధించి ప్రత్యేక దరఖాస్తులను తీసుకుంటామని చెప్పారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఇంట్లో ఇద్దరు ఉంటే వారి పేర్లు నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో అయోమయానికి గురయ్యారు. అదేవిధంగా ఒకే ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు, రెండు కరెంట్ మీటర్లు ఉన్నవారి సందేహాలను నివృత్తి చేయలేక అధికారులు సైతం అక్కడక్కడ దాటవేతను ప్రదర్శించారు. చిన్నపిల్లలకు ఆధార్కార్డు లేనివారికి వివరాలు ఎలా పొందుపరచాలనే విషయంపై క్లారిటీ లేకుండాపోయింది. ముఖ్యంగా కౌలు రైతుల తమ ఆధారం ఎలా చూపించాలని అనే విషయంపై మల్లగుల్లాలు పడ్డారు. ఉపాధిహామీ కూలీలు అయి ఉన్నప్పటికీ జాబ్కార్డు నెంబర్లు తెలవకపోవడం, వారి దగ్గర జాబ్కార్డులు లేకపోవడంతో వారు దరఖాస్తు ఫారంలో సదరు వివరాలు నమోదు చేయలేకపోయారు.