భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల కమిషన్ వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నది. వందశాతం ఓట్ల నమోదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. 12-డి ఫారం ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు ప్రత్యేక బృందం ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 13,082 మంది వృద్ధులు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అత్యవసర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్నిచ్చింది. కానీ ఈ సారి ఎన్నికల విధులు నిర్వహించే జర్నలిస్టులకూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నది. జర్నలిస్టులు 12-డి ఫారం ద్వారా ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు అక్రిడిటేషన్, ఆధార్ కార్డును పరిశీలించి అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇస్తారు. ఇప్పటికే జిల్లా పౌరసంబంధాలశాఖ అధికారి శీలం శ్రీనివాసరావు అక్రిడిటేషన్ ఉన్నవారి జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించారు.
దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బీఎల్వోలు జిల్లావ్యాప్తంగా ఉన్న దివ్యాంగులను గుర్తించారు. వారు ఓటు హక్కు వినియోగించుకునేలా బీఎల్వోలు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,095 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వీటిలో 282 పోలింగ్ కేంద్రాలను పోలీసులు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంటుంది. మైక్రో అబ్జర్వర్స్ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ను పర్యవేక్షిస్తారు.
18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల విధులు నిర్వహించే జర్నలిస్టులు, 80 ఏళ్లు నిండిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. 12 డీ ఫారం ద్వారా ఈ వెసులుబాటు ఉంది.