భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : నిండు జీవితానికి రెండు చుక్కలు, పోలియో అంతం.. మనందరి పంతం, పోలియోను తరిమేద్దాం.. అందమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం.. అంటూ పల్స్పోలియో కార్యక్రమంపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వైద్యారోగ్యశాఖ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. ఈ నెల 3, 4, 5వ తేదీల్లో ‘పల్స్పోలియో’లో భాగంగా జీరో నుంచి ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కొత్తగూడెంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం మొర్రేడు వాగు సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఐదేండ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో చుక్కలు వేసేందుకు 4,115 మంది వైద్యసిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 1,09,180 డోస్లు అందుబాటులో ఉండగా.. జిల్లావ్యాప్తంగా 98,358 మంది చిన్నారులను గుర్తించామని, 925 కేంద్రాల్లో పోలియో చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు 92 రూట్లు, 38 ట్రాన్సిట్ సెంటర్లు, 38 మొబైల్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొలిరోజు ఆదివారమే 98శాతం వరకు పూర్తిచేసి, మిగిలిన వారందరికీ తర్వాతి రెండ్రోజుల్లో పోలియో చుక్కలు వేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ప్రియాంక ఆల పాల్వంచ సీహెచ్సీలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఖమ్మం సిటీ, మార్చి 2 : ఖమ్మం జిల్లాలో వందశాతం పోలియో నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వరికూటి సుబ్బారావు సారథ్యంలో పల్స్పోలియో కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో ఐదేండ్లలోపు చిన్నారులు 1,30,747 మంది ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ వందశాతం పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలను యూనిట్లు ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళికలు రూపొందించారు. జిల్లావ్యాప్తంగా 950 కేంద్రాలను నెలకొల్పగా వాటిల్లో 129 గిరిజన, 120 పట్టణ, 701 గ్రామీణ ప్రాంతాలున్నాయి. ముందుగానే 8 వేల పోలియో చుక్కల వైల్స్ను తెప్పించి అన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. 3,800 మంది వైద్యారోగ్యశాఖ సిబ్బందిని నియమించారు. మరో 95 మంది పర్యవేక్షకులను 30 సంచార బృందాలు, ప్రయాణంలో ఉన్నవారి కోసమని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్స్లో 30 కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు 95 వాహనాలను సిద్ధంగా ఉంచారు. ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు. సోమ, బుధ వారాల్లో వైద్యారోగ్య శాఖ యంత్రాంగం ఇంటింటినీ సందర్శిస్తారు.
జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వందశాతం విజయవంతానికి వైద్యారోగ్యశాఖ యంత్రాంగం విస్తృత ప్రచారం చేశారు. కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో పలు సమావేశాలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో అప్పటికే డ్రాప్స్ ఇచ్చినా మరోసారి వేయాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఖమ్మం నగరంలో శనివారం పల్స్పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ వద్ద డీఎంహెచ్వో సుబ్బారావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మయూరిసెంటర్, వైరారోడ్, అంబేద్కర్ సెంటర్ మీదుగా జిల్లా ప్రధాన ఆసుపత్రి వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ అప్పుడే పుట్టినబిడ్డ నుంచి ఐదేండ్ల లోపు చిన్నారులందరికీ పోలియో డ్రాప్స్ వేయించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ప్రమీల, ఐఎంఏ ఖమ్మం ప్రెసిడెంట్ డాక్టర్ నారాయణరావు, డెమో కాశీనాథ్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ వీపీ గౌతమ్ డీఎంహెచ్వో సుబ్బారావుతో కలిసి పల్స్పోలియో పోస్టర్ను ఆవిష్కరించారు.