– ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం రూరల్, డిసెంబర్ 03 : ఖమ్మం జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంతో కూడిన నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా సమన్వయంతో పని చేయాలని పోలీస్ అధికారులు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎన్నికల విధులు, విధివిధానాలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై ఖమ్మం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో కిసాన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సీపీ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణకు లోబడి పని చేయాలన్నారు. ఎన్నికల నియమావళిపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని, ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు. అప్పగించిన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని సూచించారు.
ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని నిలువరించేందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లైయింగ్ స్క్వార్జ్ టీమ్స్, సరిహద్దు చెక్ పోస్టులు, రూట్ మొబైల్ పార్టీలు, ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు సందర్భంగా నిర్వహించే విధుల్లో పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. అదే విధంగా ఎన్నికల సభలు, సమావేశాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకొవాలన్నారు. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం లేకుండా పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరంగా చేయాలని, బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలను నియత్రించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా & ఆర్డర్ ప్రసాద్ రావు, ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐలు రాజు, మురళి, సంజీవ్, తిరుపతి, రూరల్ డివిజన్ ఎస్ఐలు పాల్గొన్నారు.

Khammam Rural : ‘స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యంగా పోలీసు సిబ్బంది పనిచేయాలి’