కారేపల్లి, మార్చి 28 : జిల్లాలో ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని కారేపల్లి క్రాస్రోడ్లో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను గురువారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన వాహన తనిఖీలు చేపట్టారు. అనంతరం కారేపల్లి ఠాణాకు వెళ్లి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లాలో మోహరించిన కేంద్ర పోలీసు బలగాలతోపాటు స్థానిక పోలీసులు చెక్పోస్టుల వద్ద వాహన తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఖమ్మం కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో పొరుగు జిల్లాల నుంచి వచ్చే ప్రతి వాహనంతోపాటు నగరం నుంచి బయటకు వెళ్లే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు, ఎక్కువ మొత్తంలో బంగారు, ఇతర ఆభరణాలు ఉంటే సీజ్ చేస్తామన్నారు. జిల్లాలో 12 ఎఫ్ఎస్టీ, 15 ఎస్ఎస్టీ, 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ బోర్డర్ చెక్పోస్ట్లు, 8 అంతర్ జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలు సీసీ కెమెరాల నిఘాలో ఉంచినట్లు వివరించారు. చెక్పోస్టుల వద్ద తనిఖీ అధికారులు, సిబ్బందికి వాహనదారులు, ప్రజలు సహకరించాలని సీపీ కోరారు.