పాల్వంచ, మార్చి 16: పాల్వంచ పట్టణంలో దొంగ నోట్ల ముద్రణ రాకెట్ ఉందన్న విషయం సంచలనంగా మారింది. ఆంధ్రా రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో దొంగ నోట్లను మారుస్తున్న తొమ్మిదిమందిని అక్కడి పోలీసులు పట్టుకుని విచారించారు. దొంగ నోట్లను పాల్వంచలో ముద్రిస్తున్నట్లుగా ఆ నిందితులు చెప్పారు. పాల్వంచ పట్టణానికి చెందిన పొదిల మురళి అనే వ్యక్తి ఇంటి వద్ద దొంగ నోట్లను ముద్రిస్తున్నట్లు వారు బయటపెట్టారు.
మురళితోపాటు పాల్వంచకే చెందిన జంగం శ్రీనివాస్, కఠారి సామ్రాజ్యం, గౌడుగొళ్ల కిరణ్కుమార్, ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొనకాళ్ల చిట్టిబాబు, ఆశ్వారావుపేట మండలం అచ్చుతాపురానికి చెందిన పాకనాటి నాగేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా ఉప్పల్కు చెందిన పసుపులేటి ఉమేష్చంద్ర, ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన వేముల పుల్లారావు ముఠాగా ఏర్పడి ఈ దొంగ నోట్లను చలామణీ చేస్తున్నారు. వీరంతా పాల్వంచలోని పొదిలి మురళి ఇంటి వద్ద దొంగ నోట్లను ముద్రిస్తున్నారు. ఇందుకయ్యే ఖర్చుకు గౌడుగోళ్ల కిరణ్కుమార్ పెట్టుబడి పెట్టాడు. ముద్రించిన దొంగనోట్లను పొదిలి మురళి, కఠారి సామ్రాజ్యం (మహిళ), పాకనాటి నాగేశ్వరావు, పసుపులేటి ఉమేష్చంద్ర, పొదిలి శ్రీనవాస్ కలిసి పాల్వంచతోపాటు భద్రాచలం, ఏపీలోని ఎటపాక, నెల్లిపాక, వీఆర్పురం, రేఖపల్లి, కూనవరం, చింతూరు, కుంట తదితర ప్రాంతాల్లో చలామణీ చేస్తున్నారు.