లక్ష్మీదేవిపల్లి, జూన్ 26: “సడుగులెంట, మడులెంట, ఖాళీ, సర్కారు స్థలాలెంట నాటిన మొక్కలు మహా వృక్షాలవ్వాలి. హరితహారంతో ఊళ్లన్నీ వనాలవ్వాలి. ఆహ్లాదకర వాతావరణంతో పల్లెలు కళకళలాడాలి. ప్రజలను పచ్చందాలు మురిపించాలి. బాటసారులు, రైతులు సేద తీరేందుకు వృక్షాలు నీడనివ్వాలి. పిల్లలు, మహిళలకు అందమైన పూలనివ్వాలి. వానరాలు తినేందుకు కాయలు, పండ్లనివ్వాలి. పక్షులు, పిచ్చుకలు గూళ్లు పెట్టుకునేందుకు ఆశ్రయం ఇవ్వాలి. కాలుష్యాన్ని తరిమికొట్టి మానవాళికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే గాలినివ్వాలి. మన తరం ముందు తరాలకు చెప్పుకునేలా ఊళ్లు, పట్టణాల్లో పచ్చదనం పరిఢవిల్లాలి..” అనే సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇప్పటివరకు ఎనిమిది విడతలను విజయవంతంగా పూర్తి చేసింది. తొలకరి పలకరించిన నేపథ్యంలో తొమ్మిదో విడతనూ విజయవంతం చేసేందుకు యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఇక తేదీ ప్రకటించడమే తరువాయి..!
జిల్లాను పచ్చలహారంగా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటే ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. మొక్కలు నాటాల్సిన ప్రాంతాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. నర్సరీల్లో మొక్కలనూ సిద్ధం చేశారు. దీంతో 9వ విడత హరితహారానికి భద్రాద్రి జిల్లా అధికారులు సర్వసన్నద్ధంగా ఉన్నట్లయింది. పర్యావరణ పరిరక్షణ కోసం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం 8 విడతలుగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ విడతల్లో నాటిన మొక్కలతో జిల్లా అంతా పచ్చలహారంలా దర్శనమిస్తోంది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రావడంతో వర్షాలు ప్రారంభమవుతున్నాయి. ఇంకొద్దిమేర వర్షాలు విస్తృతమైతే 9వ విడత హరితహారానికి శ్రీకారం చుట్టేందుకు అధికారులు సర్వసన్నద్ధంగా ఉన్నారు.
మొక్కల సంరక్షణకు హరిత కమిటీలు..
జిల్లాలో నాటేందుకు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొక్కలను పెంచారు. నాటిన మొక్కలు చనిపోకుండా ఉండేందుకు హరిత కమిటీలను నియమించారు. ఆ కమిటీలు మొక్కల సంరక్షణ బాధ్యతను చేపట్టనున్నాయి. హరితహారం న్విహణపై కలెక్టర్ అనుదీప్ కూడా ఇప్పటికే సమీక్షించి ఆయా శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లా లక్ష్యం 65.14 లక్షల మొక్కలు..
9వ విడత హరితహారంలో జిల్లావ్యాప్తంగా 65.14 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాల మేరకు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో నాటిన మొక్కలు కాకుండా ఈసారి వేరే మొక్కలను ఎక్కువగా పెంచారు. నర్సరీల్లో ప్రధానంగా పండ్ల మొక్కలు నాటనున్నారు. వాటి సంరక్షణకూ అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
నాటిన మొక్కలు సంరక్షించేలా..
అయితే, గతంలో నాటిన మొక్కలు చనిపోయిన ప్రాంతాలు, రోడ్ల పక్కన, చెరువులు, కుంటల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో ప్రధానంగా మొక్కలను నాటాలని కలెక్టర్ అనుదీప్ నిర్ణయించారు. అలాగే గృహాల్లో, పల్లె ప్రకృతి వనాల్లోనూ మొక్కలను నాటుతారు. నాటిన మొక్కల సంరక్షణకూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా మొక్కలు నాటడంతోపాటు అవి ఏపుగా పెరిగేందుకు ఎరువులు కూడా వేస్తారు. మొక్కలు పెరిగే వరకు వాటిని సంరక్షిస్తారు.
శాఖల వారీగా లక్ష్యాలు ఇలా..
జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో 10 లక్షలు, పోలీసు 500, సింగరేణి 10 లక్షలు, సెరీకల్చర్, హార్టికల్చర్ 3 లక్షలు, డీఆర్డీఏ 30 లక్షలు, ఇరిగేషన్ 50 వేలు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ లక్ష, అగ్రికల్చర్ లక్ష, ఇండస్ట్రీస్ 25 వేలు, స్కూల్ ఎడ్యుకేషన్ 500, ట్రైబల్ వెల్ఫేర్ 500, ఎస్డబ్ల్యూ బీసీ వెల్ఫేర్ 500, ఎస్సీ హాస్టళ్లు 500, మార్కెటింగ్ 500, మెడికల్ అండ్ హెల్త్ 500, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 500, పంచాయతీరాజ్ 500, దేవాదాయ 500, రెవెన్యూ 500, జిల్లా కో ఆపరేటివ్ 500, ఎల్డీఎం 500, ఎన్పీడీసీఎల్ 500, ఎఫ్డీసీ కొత్తగూడెం 1.62 లక్షలు, ఎఫ్డీసీ పాల్వంచ 2.7 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించారు. మున్సిపాలిటీల ద్వారా కొత్తగూడెంలో 1.5 లక్షలు, ఇల్లెందులో లక్ష, మణుగూరులో లక్ష, పాల్వంచలో 1.5 లక్షలు కలిసి మొత్తం 65.14 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
హరితహారానికి ఏర్పాట్లు చేస్తున్నాం..
జిల్లా వ్యాప్తంగా 9వ విడత హరితహారం కార్యక్రమాన్ని చేపట్టేందుకు అంతా సిద్ధం చేస్తున్నాం. ఈ ఏడాది 65.14 లక్షల మొక్కలను నాటేలా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. అయితే ఈ సారి ఈ లక్ష్యాన్ని సాధించడమే కాకుండా.. అంతకంటే ఎక్కువ మొక్కలను నాటేందుకు కృషి చేస్తున్నాం. మొక్కలు ఎవరు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైన మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. మొక్కల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఇంట్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి.
–రంజిత్ లక్ష్మణ్నాయక్, డీఎఫ్వో, కొత్తగూడెం