సత్తుపల్లి, మే 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం లో భాగంగా ప్రతి పల్లెలో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టారు. సత్తుపల్లి మండల పరిధిలోని 21 గ్రామపంచాయతీల్లో ప్రభుత్వ లక్ష్యం మేరకు మొక్కలను పెంచుతున్నారు. జూన్ మాసం నాటికి 4 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతి పల్లె నర్సరీలో 20 వేలకు తగ్గకుండా మొక్కలను పెంచి జూన్లో హరితహారం కార్యక్రమంలో నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్లు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది మొక్కలను వేసవిలో ఎండిపోకుండా గ్రీన్ నెట్లతో ఉదయం, సాయంత్రం వేళల్లో కూలీలతో నీటిని పోయిస్తూ సంరక్షిస్తున్నారు. పంచాయతీల్లో రైతులకు అవసరమైన టేకుమొక్కలు, ఇంటి అవసరాలకు అవసరమైన పూలు, క్రోటన్స్, పండ్ల మొక్కలను ఇంటింటికి పంచేందుకు సిద్ధం చేస్తున్నారు. నర్సరీల్లో వివిధ రకాల మొక్కలు నాలుగు లక్షలకు పైగా పెంచుతున్నారు. వాటిలో గానుగ, చింత, వేప, గుల్మొహర్, దైవకాంచన, మందార, గులాబీ, క్రోటాన్స్, ఉసిరి, దానిమ్మ, బాదం, నేరేడు, ఈత, ఖర్జూరం, మునగ, వేరుమద్ది, అల్లనేరేడు తదితర మొక్కలు ఉన్నాయి.
హరితహారం కార్యక్రమంలో భాగంగా జూన్ మాసం నాటికి మండలం నుంచి నాలుగు లక్షల మొక్కలను సిద్ధం చేశాం. నర్సరీలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నాం. నర్సరీల ఏర్పాటుతో పల్లెల్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. హరితహారంపై ప్రజలకు కూడా అవగాహన పెరిగింది. – బాబూరావు, ఈజీఎస్ ఏపీవో, సత్తుపల్లి