ఖమ్మం, ఏప్రిల్ 11 : బడుగు, బలహీన వర్గాల సమానత్వం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని దారపోసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కొనియాడారు. గురువారం పూలే జయంతిని పురస్కరించుకొని నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి నామా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళా సాధికారిత ఉద్యమాలకు ఆద్యుడని, మహిళల అభ్యున్నతికి ఆయన ఎనలేని సేవలు చేశారన్నారు. భారతీయ సమాజానికి సైతం ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. నిరక్షరాస్యత నిర్మూలన, మహిళలపై జరుగుతున్న సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. తన సతీమణి సావిత్రీబాయి పూలేను చదివించడంతోపాటు ఆమెను ఉపాధ్యాయురాలిగా చేశారన్నారు. పాఠశాలను స్థాపించడంతోపాటు మహిళలకు విద్యను అందించి ఉన్నతంగా తీర్చిదిద్దారన్నారు. స్త్రీ విముక్తి కోసం ఆయన రాసిన రచనలు, వ్యాసాలు ఎంతో ఉత్తేజపరిచాయన్నారు. కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తాళ్లూరి జీవన్కుమార్, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ వలరాజు, ఆర్జేసీ కృష్ణ, బచ్చు విజయ్కుమార్, చిత్తారు సింహాద్రియాదవ్, మాధవరావు, కోటేశ్వరరావు, ప్రసాద్, పాల్వంచ రాజేశ్, గోపి తదితరులు పాల్గొన్నారు.