సారపాక, జూలై 1: దశాబ్దంలో పోడు సమస్యను పరిష్కరించి ఆదివాసీల కల సాకారం చేసిన ఉద్యమవీరుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గొప్ప నిర్ణయం తీసుకుని పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ఆదివాసీలకు హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని స్పష్టం చేశారు. మణుగూరులోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చెవిలో జోరీగలా మారి పోడు సమస్యను అనేకమార్లు తీసుకెళ్లాలని గుర్తుచేశారు. సీఎం కూడా ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులకు పోడు పట్టాలు అందించి వారిలో సంతోషాన్ని నింపారని అన్నారు. పోడు రైతుల కోసం తాను పోరాడుతుంటే తనకు 3 వేల ఎకరాలు ఉన్నాయంటూ కొందరు వ్యతిరేకులు ఆరోపణలు చేశారని అన్నారు. మరి అన్ని ఎకరాలు ఎక్కడున్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. గతంలో ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్లు నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తాను బీజేపీలో చేరితో రూ.100 కోట్లు ఇస్తామన్న ఆఫర్ను తిరస్కరించి సీఎం కేసీఆర్ ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు తెచ్చానని అన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే మాయగాళ్లను, మోసగాళ్లను ప్రజలు నమ్మవద్దని కోరారు. సీఎం కేసీఆర్ ఓ వ్యక్తికి జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చి అందలమెక్కిస్తే ఇప్పుడతను ముఖ్యమంత్రినే విమర్శిస్తున్నాడని అన్నారు. గతంలో ఎంపీగా ఉన్న వ్యక్తి జిల్లాకు ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు గెలిచి తీరుతామని స్పష్టంచేశారు. ధరణి పోర్టల్తోనే భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పోశం నర్సింహారావు, కుర్రి నాగేశ్వరరావు, అడపా అప్పారావు, కోలేటి భవానీశంకర్, జావేద్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ సైనికుల్లా కష్టపడాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న ప్రభుత్వ పథకాలపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని, పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు బీఆర్ఎస్ సోషల్ మీడియా నియోజకవర్గ వారియర్స్కు సూచించారు. మణుగూరులో తన క్యాంపు కార్యాలయంలో వారితో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు యాంపాటి సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.