సత్తుపల్లి టౌన్, జూన్ 2: బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా రాష్ర్టానికి దిక్సూచిలా ఉండేలా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చొరవ తీసుకుంటున్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం జరుగనున్న రైతు దినోత్సవ కార్యక్రమంలో సత్తుపల్లి మండలంలోని కొత్తూరు రైతువేదికలో కర్షకుల దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కొట్టేటి బాలకృష్ణ, ఆయన కుమార్తె కళాకృతి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకురాలు సాయిశ్రీ, సౌమ్య, తోట సౌజన్య, జాహ్నవి, మౌనిష, మోహిత్, మోహన్లు.. పదిరోజులుగా నవ ధాన్యాలైన కందులు, పెసలు, మినుములు, జొన్నలు, వరిధాన్యాలు, సజ్జలు, కొర్రలు, అనువులు, బొబ్బర్లతో పెద్దపెద్ద బోర్డులపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి చిత్రపటాలను తయారుచేసి రైతువేదికలో ప్రదర్శించేందుకు ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై అభిమానంతోనే వీటిని రూపొందించామని చిత్రకారుడు బాలకృష్ణ, ఆయన కుమార్తె సాయిశ్రీ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.