పెనుబల్లి, ఏప్రిల్ 12 : ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 120 రోజుల్లో చేసిందేమీ లేదని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. పెనుబల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సప్తపది ఫంక్షన్ హాలులో శుక్రవారం సాయంత్రం జరిగింది. సమావేశానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఎంపీ నామా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని అన్నారు. పార్లమెంటులో రాష్ట్ర ప్రజల వాణి, గళం వినిపించేది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమేనని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అత్యధికంగా మాట్లాడిన ఘనత బీఆర్ఎస్ పార్టీ ఎంపీదేనని, ఆ అవకాశం కేవలం కేసీఆర్ మాత్రమే కల్పించారన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని, ఇందుకోసం పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పదేళ్ల పాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపింది కేసీఆర్ ఒక్కరేనని గుర్తు చేశారు. అలాంటి రాష్ర్టాన్ని గుంపు మేస్త్రీ రేవంత్రెడ్డి, తాపీ మేస్త్రీ మోదీ అధోగతి పాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను కాపాడుకునేందుకు మరో ఉద్యమంలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వస్తున్నారని, ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
పదేళ్లు రాష్ర్టాన్ని పాలించి.. అందరికీ అందుబాటులో ఉన్న కేసీఆర్ నిత్యం ప్రజలకు గుర్తుకొస్తున్నారని అన్నారు. ఆచరణకు నోచుకోని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రైతాంగాన్ని, పేద ప్రజలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు కంకణబద్ధులై ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆరు గ్యారెంటీలు.. పది వారెంటీలు అన్నట్లు ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టి మొండిచెయ్యి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ఇలాంటి ప్రభుత్వాన్ని తరిమికొట్టే సమయం ఆసన్నమైందన్నారు. దానిని ఎంపీ ఓటు ద్వారా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసి.. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరిస్తూ ప్రతి ఓటు కారు గుర్తుకు వేయించాలన్నారు. ఖమ్మంలో ఎవరెన్ని చెప్పినా గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థి నామాయేనని అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు మరోసారి మోసపోతే మళ్లీ గోస తప్పదన్నారు. 120 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత వచ్చిందో అందరికీ తెలిసిందేనన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు అత్యధిక మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఖమ్మం పార్లమెంట్లో సత్తుపల్లికి ప్రత్యేక స్థానం కేటాయిద్దామన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్రావు, వైస్ ఎంపీపీ నరుకుళ్ల కస్తూరి, జిల్లా నాయకులు తాళ్లూరి జీవన్కుమార్, చిత్తూరు సింహాద్రియాదవ్, లక్కినేని వినీల్, మందడపు అశోక్కుమార్, కోటగిరి సుధాకర్బాబు, వేముల నరసింహారావు, లగడపాటి శ్రీను, వంగా గిరిజాపతి, అన్ని గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.