తిరుమలాయపాలెం, నవంబర్ 28: పాలేరు నియోజకవర్గంలో తనదే జయమని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అధికారమని తేల్చిచెప్పారు. తిరుమలాయపాలెం మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన.. రాజారం తదితర గ్రామాల్లో నిర్వహించిన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులు, మహిళలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు వస్తున్న ప్రజాదరణను బట్టి కేసీఆర్ మూడోమారు ముఖ్యమంత్రి కావడం ఖాయమైందని అన్నారు.
పాలేరు నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల్లో విశేష ఆదరణ ఉందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇక్కడి ప్రజలు చూపిస్తున్న ఆదరణను చూస్తుంటే తన గెలుపు ఖాయమైందని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తన విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. టూరిస్టులకు, స్థానికేతరులకు ఓటు వేసేందుకు పాలేరు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. ధన అహంకారం కలిగిన కాంగ్రెస్ అభ్యర్థి అయిన పొంగులేటిని ఈ ఎన్నికల్లో పాలేరు ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పాలేరు నియోజకవర్గం ఎడ్యుకేషన్ హబ్గా రూపుదిద్దుకుందని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టగానే మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు బాషబోయిన వీరన్న, బానాల మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.