మధిర, ఏప్రిల్ 14 : త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తే ప్రజలు, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తానని, ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండి అండగా ఉంటానని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్షనేత, ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మధిర కన్యకాపరమేశ్వరి కల్యాణ మండపంలో మధిర పట్టణ, రూరల్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ విస్తృతస్థాయి సమావేశం రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత పదేళ్లు ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన, రైతాంగ అభివృద్ధి కోసం నాటి సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. నిత్యం ప్రజా సంరక్షణ కోసం రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగిందని, అది ఇప్పుడు ఆ పాలన కాస్తా అభివృద్ధికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్లో నిత్యం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి నాడు ఎంతో కృషి చేశానన్నారు.
మళ్లీ ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి మరోసారి పార్లమెంట్కు పంపించాలని కోరారు. మధిర నియోజకవర్గంలో తనకు గత పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సాధించామని, ఆ మెజార్టీని ఇప్పుడు రెట్టింపు చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి గెలిపించాలని, ఈ గెలుపు రాష్ర్టానికి ఒక మలుపులా తిప్పాలన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ అబద్ధపు హామీలను ప్రజలకు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రైతులను ఎవరు పట్టించుకోరో వారికి ఈ దేశంలో తగిన విధంగా రైతాంగం బుద్ధి చెబుతారన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్రావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు గెలుపు, ఓటములు సహజమని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు రాష్ట్ర ప్రజలు ఆకర్శితులై అధికారం ఇచ్చారన్నారు. ఎంపీ ఎన్నికల్లో ప్రజల ఓటును బీఆర్ఎస్ వైపు మళ్లించుకోవాలన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు మధిర నియోజకవర్గంలో నాడు నామాకు 82 వేల ఓట్లు వచ్చాయని, కాంగ్రెస్కు 62 వేలు మాత్రమే రావడం జరిగిందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, నాయకులు రంగిశెట్టి కోటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, మొండితోక జయాకర్, బిక్కి కృష్ణప్రసాద్, చావా వేణు, తాళ్లూరి జీవన్కుమార్, శీలం వెంకటరెడ్డి, వాసిరెడ్డి నాగేశ్వరరావు, బొగ్గుల భాస్కర్రెడ్డి, అరిగె శ్రీనివాసరావు, కోన నరేందర్రెడ్డి, భోగ్యం ఇందిర, అబ్బూరి రామన్, చావా వేణు, కౌన్సిలర్లు ఇక్బాల్, మాధవి, అప్పారావు, వరలక్ష్మీ, రజిని పాల్గొన్నారు.