ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. టేకులపల్లి కేసీఆర్ టవర్స్ డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు 263 మందికి పట్టాలను పంపిణీ చేశారు. 23వ డివిజన్ శాంతినగర్ మున్సిపల్ కమ్యూనిటీ హాల్లో కంటి వెలుగు శిబిరాన్ని, 10వ డివిజన్లో రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో రూ.120 కోట్లతో 2 వేలకు పైగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించినట్లు చెప్పారు.
– ఖమ్మం, ఏప్రిల్ 17
ఖమ్మం, ఏప్రిల్ 17: డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. లబ్ధిదారులందరూ ఈ ఇళ్లను కాపాడుకోవాలని సూచించారు. నగరంలోని టేకులపల్లి కేసీఆర్ టవర్స్ డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల్లో 263 మందికి సోమవారం మంత్రి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడతలో సుమారు ఒక వేయిమంది లబ్ధిదారులకు పట్టాలు ఆందజేశామని, రెండో విడత లబ్ధిదారులకు ప్రస్తుతం పట్టాలు అందజేస్తున్నామని అన్నారు. 11 ఎకరాల్లో 1,250 ఇళ్లను ఒకేచోట ఒక గేటెడ్ కమ్యూనిటీగా నిర్మించి అందించామని వివరించారు. ఒకో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6 లక్షలను వెచ్చించినట్లు చెప్పారు. విద్యుత్, అంతర్గత రోడ్లు, తాగునీరు, డ్రెయిన్లు వంటి అన్ని రకాల సౌకర్యాలను కల్పించినట్లు వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం వంటివి కూడా ఏర్పాటు చేశామన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో రూ.120 కోట్లతో 2 వేలకు పైగా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు. వైఎస్ఆర్ నగర్, అల్లిపురం, మల్లెమడుగుల్లో ఇంకో 400 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఇళ్ల నిర్మాణ సమయంలో సుమారు 40 మార్లు అక్కడికి వెళ్లి పనుల పురోగతిపై తనిఖీలు చేసినట్లు చెప్పారు. రోడ్ల నిర్మాణాలకు కూడా రూ.4 కోట్లు వెచ్చించామన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు లబ్ధిదారుల సొంతమని, ఈ ఆస్తిని కాపాడుకోవాలని సూచించారు. ఇది కోల్పోతే ఈ జన్మలో మళ్లీ రాదని గుర్తుచేశారు. అందుకని దీనిని దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. ఏఎంసీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, ఆర్డీవో రవీంద్రనాథ్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
దృష్టి లోపం నివారణకే ‘కంటి వెలుగు’
కంటిచూపు బాగుంటేనే మనం ఏ పనైనా చేసుకోగలుగుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ప్రజల్లో దృష్టి లోపాన్ని నివారించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం అమలు చేస్తోందని, ఇటీవల మొదలైన రెండో విడత కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోందని అన్నారు. ఇందులో భాగంగా ఖమ్మం 23వ డివిజన్ శాంతినగర్ మున్సిపల్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి అజయ్ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. మారిన జీవన విధానం, వివిధ రకాల పని ఒత్తిళ్ల వల్ల ప్రజల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. దీనిని గమనించిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల కంటి చూపు సమస్యలపై దృష్టి పెట్టిందని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. మొదటి విడతలో 1.50 కోట్ల మందికి స్రీనింగ్ చేసి 50 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. కంటి వెలుగు శిబిరాలను ప్రతి ఒకరు సద్వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్పొరేటర్ మక్బూల్, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, డాక్టర్ బీ.మాలతి, డాక్టర్ ఎవాంజలిన్, తన్నీరు శోభారాణి, షకీనా పాల్గొన్నారు.
సంబురాలు వద్దు.. సాయం చేయండి
చీమలపాడులో జరిగిన అగ్ని ప్రమాద ఘటన, తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు అనారోగ్యం కారణంగా ఈ నెల 19న తన జన్మదిన వేడుకలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం ఒక ప్రకటన ద్వారా ప్రకటించారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, పార్టీ ప్రజాప్రతినిధులు ఈ సారి తన జన్మదిన సంబరాలు జరుపవద్దని కోరారు. దానికి బదులుగా స్థానికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చీమలపాడు అగ్ని ప్రమాద ఘటన బాధాకరమని అన్నారు.