మామిళ్లగూడెం, జనవరి 6: గ్రామీణాభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలతో బృహత్తరమైన ప్రగతి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోతోందని వివరించారు. గ్రామీణాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో రెండో రోజు శుక్రవారం నిర్వహించిన జాతీయ వర్క్ షాపులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన మాట్లాడారు.
తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని, పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని వివరించారు. పట్టణాల్లో మాదిరిగా పల్లెల్లోని పంచాయతీ వర్కర్లు ప్రతి ఇంటికీ వెళ్లి చెత్తను సేకరించి దానిని ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డులకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇంకుడు గుంతల నుంచి రైతు వేదికల దాకా అన్నింటినీ అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని పేర్కొన్నారు.