కూసుమంచి, మే 13: రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఆదివారం వరకు తొమ్మిది మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ధాన్యం కొనుగోలు, మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సివిల్ సప్లయి అధికారులు, ప్రజాప్రతినిధులు, మిల్లర్లతో కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఇబ్బందులను తొలగించి రైతులకు సమస్యలు రాకుండా చూడాలని, ఇందుకోసం అధికారులంతా సన్వయంతో పని చేయాలని సూచించారు.
గోదాములు లేని ప్రాంతాల్లో ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేయాలని సీఎంతో జరిగిన సమావేశంలో చర్చించామని, ఇటీవల సివిల్ సప్లయి శాఖ మంత్రితో కూడా ఇదే విషయంపై చర్చించామని, రైతుల సమస్యలను తెలియజేశామని అన్నారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని, ప్రతి ఒక్కరి నుంచీ ధాన్యాన్ని సేకరిస్తామని అన్నారు. కాగా, కొనుగోలు కేంద్రాల్లోని సమస్యల గురించి ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే శనివారం వరకు ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు రాజేందర్, సోములు, నర్సింహ, విజయకుమారి, రామసహాయం బాలకృష్ణారెడ్డి, బాణోత్ శ్రీనివాస్, ఇంటూరి శేఖర్, నాగుబండి శ్రీనివాసరావు, బెల్లం ఉమ, మంగీలాల్, వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య, పాషబోయిన వీరన్న, రాంకుమార్, చావా వేణు, సైదిరెడ్డి పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం, మే 13: మండలంలోని కాకరవాయిలో రూ.25 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణాలకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి శనివారం రాత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ లింగారెడ్డితోపాటు కొందరు వార్డు సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన 80 కుటుంబాలవారు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి ఎల్లవేళలో అండగా ఉంటామని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బోడ మంగీలాల్, చావా వేణు, వీరబోయిన మౌనికా శ్రీనివాస్, వీరన్న, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు.