మే 13 : వేసవి కాలంలో పశువుల పట్ల యజమానులు కనీస జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకుంటే వడదెబ్బకు గురై తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉంది. పశు వైద్యులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. వేసవిలో ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడి గాలుల వల్ల పశువులు అనారోగ్యానికి గురవుతాయని అంటున్నారు. అందుకని జీవాలను కాపాడుకునేందుకు కనీస యాజమాన్య చర్యలు చేపట్టాలని పశు వైద్యాధికారులు రైతులకు, యజమానులకు సూచిస్తున్నారు. ఆవులతో పోల్చితే గేదెలు ఎక్కువ ఉష్ణతాపం భారిన పడుతుంటాయి. గేదెలు నల్లగా ఉన్న కారణంగా నలుపు రంగు వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో ఈ ప్రభావం వాటిపై ఎక్కువగా ఉంటుంది.
వడదెబ్బను ఇలా గుర్తించాలి..
వేసవిలో మనుషులే కాదు పశువులు కూడా వడదెబ్బకు గురవుతుంటాయి. దీంతో పాల దిగుబడి తగ్గుతుంది. పశువులు ఎదకు రాకపోగా చూడి కట్టే అవకాశాలు కూడా తక్కువే. ఒక్కోసారి పశువులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదమూ ఉంటుంది. వడదెబ్బకు గురైన పశువులు నీరసించిపోతాయి. శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుంది. శ్వాసక్రియ ఎక్కువగా ఉంటుంది. నడిచేటప్పుడు ఇబ్బంది పడుతుంటాయి. చర్మం పొడిబారుతుంది. అంతేగాక నడుస్తున్నప్పుడు కింద పడి స్పృహ కోల్పోయే ప్రమాదాలూ ఉన్నాయి.
వడదెబ్బకు గురైతే ఇలా చేయాలి..
వడదెబ్బకు గురైన పశువులను గుర్తిస్తే వెంటనే వాటిని నీడ ప్రదేశానికి తరలించారు. చల్లని నీటితో పశువు ముఖాన్ని కడగాలి. తర్వాత ఐస్ను ఒక క్లాత్లో చుట్టి పశువు నుదుటిపై ఉంచాలి. పశు వైద్యుడిని సంప్రదించి స్లైన్ ఎక్కించాలి. పశువు కోలుకునే వరకు చాప్ కట్టర్తో కట్ చేసిన పచ్చిగడ్డిని మాత్రమే అందించాలి. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రవణాలను ఇవ్వాలి. కేవలం ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటకు మేత కోసం తీసుకెళ్లాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో నీడ ప్రదేశాలకు తరలించడం ఉత్తమం. ముఖ్యంగా వడదెబ్బకు గురైన పశువులను చల్లని, ఎక్కువ గాలి వీచే ప్రదేశాలకు తరలించారు.
జాగ్రత్తలు తీసుకోవాలి..
వేసవిలో పాడి పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, ఎండ తీవ్రతకు అవి వడదెబ్బకు గురవుతాయి. దీంతో ఒక్కోసారి ఆ పశువులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలూ ఉన్నాయి. పశువులను ఎండలో తిప్పకుండా ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే మేతకు తీసుకెళ్లాలి. అనారోగ్యానికి గురైన పశువులను గుర్తించి వైద్యం అందిచాలి. షెడ్లు ఏర్పాటు చేసి చుట్టూ రక్షణ చర్యలు తీసుకుంటే పశువులను వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. పశువులు అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే పశువైద్యులను సంప్రదించాలి.
-డాక్టర్ మన్యం రమేశ్, పశు వైద్యుడు, దమ్మపేట