కారేపల్లి, మే 17 : భారీ క్రేన్ అదుపుతప్పి పల్టీ కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కొణిజర్ల మండలానికి చెందిన రాజేష్ ఒక క్రేన్ డ్రైవర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్రేన్తో పనులు ముగించుకొని తిరిగి సొంత ఊరు వెళ్తున్నాడు. ఇల్లెందు ఖమ్మం ప్రధాన రహదారి గాంధీనగర్ సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర్లో ఉన్నట్టుండి క్రేన్ అదుపుతప్పి పల్టీ కొట్టింది.
అప్రమత్తమైన రాజేష్ వెంటనే కిందికి దూకగా అతనిపై క్రేన్ పడింది. క్రేన్ కింద పడిన రాజేష్ను కాపాడేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నంచినాకీ ఫలితం లేకుండా పోయింది. సుమారు గంటపాటు ఆర్తనాదాలు చేస్తూ కొట్టుమిట్టాడుతూ రాజేష్ ప్రాణాలు వదిలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్రేన్ యజమాని రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్లో రాజేశ్ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు పక్కన పడిన క్రేన్ను తొలగించానికి సుమారు గంటన్నరకు పైగా పట్టింది. దాంతో ఇల్లందు ఖమ్మం ప్రధాన రహదారిపై వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి.