కూసుమంచి/ కూసుమంచి రూరల్, మే 7: ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా పనులు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్.. అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, తక్షణం అంచనాలు తయారు చేయాలని సూచించారు. ‘మన బడి’ పనుల పరిశీలనలో భాగంగా శనివారం మండలానికి వచ్చిన ఆయన.. విస్తృతంగా పర్యటించారు. పాఠశాల, అంగన్వాడీలను సందర్శించారు. జీళ్లచెరువు పాఠశాల, ఫైర్ స్టేషన్ పరిశీలించారు.
ప్రభుత్వ పాఠశాల స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన బడి’లో భాగంగా పాఠశాలల్లో కల్పించాల్సిన మౌలిక వసతులపై శ్రద్ధ వహించాలని సూచించారు. కూసుమంచి హైస్కూల్కు చేరుకున్న కలెక్టర్.. నూతన భవన సామర్థ్యం, విద్యార్థుల సంఖ్య, పాఠశాల నిర్వహణ విషయాల గురించి ఎంఈవో రామాచారి, హెచ్ఎం హుస్సేన్ను అడిగి తెలుసుకున్నారు. 850 మందికిపైగా విద్యార్థులు ఉండడంతో ఆనందం వ్యక్తం చేశారు. రూ.కోట్ల విలువైన స్థలాన్ని దాతలు పాఠశాలకు ఇచ్చిన విషయం తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాలల ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కూసుమంచి ఫైర్ స్టేషన్ను కలెక్టర్ తనిఖీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ అన్సారీ, ఎంపీడీవో కరుణాకర్రెడ్డి, ఎంపీవో రామచందర్రావు, ఎంఈవో రామాచారి, సర్పంచ్లు చెన్నా మోహన్రావు, కొండా సత్యం, పీఆర్ ఈఈ వెంకటరెడ్డి, డీఈ శ్రీనివాస్, జేఈ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రంజిత్రెడ్డి, కార్యదర్శి నరేశ్ పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా చేగొమ్మ పాఠశాల ప్రహరీని ఎవరు కూల్చివేశారని హెచ్ఎం భద్రును కలెక్టర్ ప్రశ్నించగా.. తనకు తెలియదని, సెలవురోజున కూల్చివేశారని సమాధానమిచ్చారు. ఎవరు కూల్చివేశారో తెలుసుకొని ఉన్నతాధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. దీంతో హెచ్ఎం ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్.. ‘నీకు బాధ్యత లేదా?’ అని ప్రశ్నించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు హెచ్ఎంను సస్పెండ్ చేయాలని డీఈవోను ఆదేశించారు. చేగొమ్మలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.