భద్రాద్రి కొత్తగూడెం, మే 28 (నమస్తే తెలంగాణ) : ధరణి వచ్చింది.. తరతరాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరికింది.. చిక్కుముడులకు చెక్ పడింది. ఆఫీసుల చుట్టూ తిరుగుడు తప్పింది. అక్రమ పట్టాలు బంద్ అయ్యాయి. ఊళ్లల్లో, కుటుంబాల్లో గొడవలు తగ్గాయి. భూములు రికార్డుల్లో భద్రంగా ఉన్నాయి. ఎక్కడా పైసా లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయి. కొత్త పట్టా పాస్బుక్లు రోజుల వ్యవధిలోనే చేతికొస్తున్నాయి. ధరణి పోర్టల్ రాకముందు దొడ్డిదారిలో దళారుల ప్రమేయంతోనే పనులు జరిగేవి. కానీ నేడు క్షణాల్లో దర్జాగా పనులు ముగుస్తున్నాయి. ధరణితో తమ బాధలు బంద్ అయ్యాయని రైతన్నలు సంబురపడుతున్నారు. దరహాసం చిందిస్తున్నారు. ఏ సమస్యనైనా కూకటివేళ్లతో పెకిలించగల ధీశాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ను వ్యవసాయ భూమి ఉన్న ప్రతిఒక్కరూ కొనియాడుతున్నారు. తమ బాధలను బాపిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
అప్పుడు మన భూమిని మన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే బ్రోకర్లను వెంటబెట్టుకుని రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే. అటు అధికారులకు, ఇటు బ్రోకర్లకు లంచాలు ఇచ్చుకున్నా పని అయితదో లేదో. ఇదంతా పాత ముచ్చట. పాలకులు సైతం జనం మీదనే బతికేశారు. అందుకే కొట్లాడి మరీ తెలంగాణ తెచ్చారు కేసీఆర్. అలాంటి పాపాల భైరవుల బంఢారం బయటపెట్టించి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పక్కనబెట్టి భూమికి పక్కాగా లెక్క ఉండేందుకు ధరణి పోర్టల్ను 2020 నవంబర్ 8వ తేదీన తీసుకొచ్చారు. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి రావడంతో ఎంతోకాలంగా చిక్కులతో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభించింది.
నాడు దొడ్డిదారి.. నేడు దర్జాగా
నాడు దొడ్డిదారిలో పనులు చేయించుకునే దుస్థితికి తెలంగాణ ప్రభుత్వం చరమగీతం పాడింది. రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం నేరుగా కార్యాలయాలకు వెళ్లి పనులు చేయించుకునే అవకాశం లభించింది. కొత్తగా ప్రవేశపెట్టిన ధరణి సేవలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మీ సేవలో స్లాట్బుక్ చేసుకున్న మరుక్షణమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిఅవుతున్నది. దానివల్ల భూముల కొనుగోళ్లు, అమ్మకాలు చకచకా జరిగిపోతున్నాయి. వన్బీలు కావాలన్నా వెంటనే లభిస్తున్నది.
గిరిజన ప్రాంతాల్లోనూ రిజిస్ట్రేషన్లు..
భూమిపై సర్వహక్కులు పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చిన ధరణి పోర్టల్ గిరిజన ప్రాంతాల్లో కూడా అమలవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన జిల్లాలో కూడా ఈ సేవల ను అందుబాటులో తేవడంతో ఏజెన్సీలో భూమి సమస్యలకు పరిష్కారం లభించింది. గతంలో మైదాన ప్రాంతాలకే పరిమితమైన ధరణి సేవలు గిరిజన ప్రాంతాల్లో అమలయ్యేలా ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవడంతో గిరిజన ప్రాంత తహసీల్దార్లు ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నట్లు రైతులకు తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో భూములు గతంలో విక్రయాలు జరగాలంటే చాలా సమయం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా గిరిజనుడు దరఖాస్తు చేసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ పరిశీలన చేసి ఆన్లైన్ ద్వారా నివేదికను సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి అందజేస్తారు. ఈ విషయాన్ని భూమి యజమానికి ఫోన్ ద్వారా మెస్సేజ్ పంపిస్తారు. దీంతో భూమి యజమాని స్లాట్బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కలుగుతుంది. ఈ విధంగా గిరిజన ప్రాంతంలో కూడా క్రయవిక్రయాలు జరుపుకునే అవకాశం ధరణి ద్వారా కలిగింది.
ధరణి చాలా బాగుంది..
రైతులు చాలా సులభంగా భూముల క్రయవిక్రయాలు జరుపుకునేందుకు ధరణి చాలా ఉపయోగపడుతున్నది. దీనివల్ల పక్కాగా ఎవరి పొలం వాళ్లకే ఉంటుంది. గతంలో ఎవరి పొలం ఎక్కడ ఉందో తెలిసేది కాదు. అన్ని చిక్కుముడుల్లా ఉండేవి. సర్వేయర్ వచ్చి ఈ భూమి నీది అనేదాక తెలిసేది కాదు. ఇప్పడు సర్వేనెంబర్తో సహా భూమి ఎక్కడ ఉందో తెలిసిపోతున్నది. మన పొలానికి పక్కా ఆధారం ధరణి. కార్యాలయాలు చుట్టూ తిరిగే బాధ తప్పింది.
– తులసిరెడ్డి, వేపలగడ్డ, రైతు
ఒక్కసారి ధరణిలోకి ఎక్కితే చాలు..
ధరణి పోర్టల్తో రైతులకు చాలా మేలు. ఒక్కసారి ధరణి వెబ్సైట్లోకి పేరు ఎక్కితే చాలు దానిని మార్చడం ఎవరితరం కాదు. అందుకే ప్రభుత్వం ఇలాంటి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గిరిజన, గిరిజనేతరులకు కూడా షెడ్యూల్, నాన్ షెడ్యూల్ ప్రాంతాలకు వర్తించేలా చర్యలు తీసుకున్నది. పెండింగ్లో ఉన్న పుస్తకాలు పోస్టల్ ద్వారా ఇంటికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
– భగవాన్రెడ్డి, బూర్గంపాడు తహసీల్దార్