కొత్తగూడెం క్రైం, మార్చి 20 : ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను వన్టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించిన పూర్వాపరాలను ఇన్చార్జి ఎస్హెచ్వో, ఇన్స్పెక్టర్ లావుడ్యా రాజు వెల్లడించారు. కొత్తగూడెం పట్టణం సన్యాసిబస్తీకి చెందిన గాయపాక ప్రవీణ్(32) అదే బస్తీకి చెందిన లావణ్యను ఐదేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య వివాదాలు చోటుచేసుకోవడంతో లావణ్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. తన ఇంటి సమీపంలో ఉండే తంగెళ్ల సుమంత్తో లావణ్యకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
దీంతో ఈ విషయం ప్రవీణ్కు తెలియడంతో ఈ నెల 18వ తేదీన సాయంత్రం ప్రవీణ్ లావణ్య ఉండే ఇంటికి వెళ్లాడు. అక్కడ సుమంత్తో లావణ్యకు ఏర్పడిన వివాహేతర సంబంధం గురించి నిలదీయడంతో ఈ విషయం గురించి మరుసటి రోజు చర్చించుకుందామని చెప్పి అతన్ని వెళ్లగొట్టింది. అనంతరం సుమంత్తో కలిసి ప్రవీణ్ అడ్డు తొలగించుకునేందుకు పక్కా స్కెచ్ వేసింది. ఈ విషయం తెలియని ప్రవీణ్ 19వ తేదీన ఉదయం లావణ్య ఇంటికి మళ్లీ వెళ్లాడు. అప్పటికే వ్యూహం రచించిన లావణ్య, సుమంత్ ఇంటికి వచ్చిన ప్రవీణ్తో గొడవకు దిగి అతడిపై దాడిచేసి ఇనుపరాడ్డు, రోకలిబండతో విచక్షణారహితంగా కొట్టి, ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి పడేశారు.
అక్కడితో ఆగక లావణ్య పక్కనే ఉన్న నాపరాయి తీసుకుని ప్రవీణ్ నడుముపై బలంగా మోదింది. ఘర్షణను స్థానికులు గమనించడంతో సదరు నిందితులిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వన్టౌన్ పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారు. నిందితుల కోసం ఆ చుట్టపక్కల ప్రాంతంలో గాలింపులు చేపట్టారు. ఇందులో భాగంగానే సోమవారం ఉదయం పారిపోయేందుకు ప్రయత్నించిన సుమంత్, లావణ్యను పోలీసులు పోస్టాఫీస్ సెంటర్లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రోకలిబండ, ఇనుపరాడ్డు స్వాధీనపరుచుకుని, నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ రాజు తెలిపారు. త్వరితగతిన ఈ కేసుని చేధించిన సిబ్బందిని అభినందించారు. సమావేశంలో వన్టౌన్ ఎస్సైలు రెడ్డెం నర్సిరెడ్డి, విజయ, టి.లచ్చయ్య, హెడ్ కానిస్టేబుల్ ఎస్కేఏ గని, కానిస్టేబుళ్లు సురేశ్, ఆర్.కల్యాణి పాల్గొన్నారు.
ప్రేమించి పెళ్లాడిన భర్త చేదయ్యాడు.. మధ్యలో వచ్చిన స్నేహితుడు ప్రియుడయ్యాడు.. ఇంకేముంది దంపతుల మధ్య గొడవలు షురూ అయ్యాయి.. కొంతకాలానికి అవి భార్యాభర్తల నడుమ దూరాన్ని పెంచాయి.. ప్రియుడి ప్రేమలో కమ్ముకున్న మైకం భర్తతో మరింత దూరాన్ని పెంచింది.. దీంతో భర్త అడ్డు తొలగించుకుంటే అంతా సజావుగా సాగుతుందని భావించింది.. కనికరం లేకుండా కట్టుకున్నోడినే ప్రియుడితో కలిసి కడతేర్చింది.. కోరుకున్నోడితో పారిపోదామనుకుని పోలీసులకు చిక్కి చెరసాల పాలైంది.