ఒక్క పోర్టల్ వందలాది సమస్యలకు పరిష్కారం చూపింది.. భూవివాదాలను దూరం చేసింది.. అనుబంధాలు తెగిపోకుండా కాపాడింది.. రెవెన్యూ పరిధిలోభూరికార్డుల ప్రక్షాళనకు బాటలు వేసింది.. ఆ పోర్టలే ‘ధరణి’. భూమి వివరాలను పారదర్శకంగా ఆన్లైన్ చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో లక్షలాది మంది రైతులకు ప్రయోజనం కలిగింది. నయాపైసా ఖర్చు లేకుండా కొత్త పాసు పుస్తకాలు చేతికి వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క పోర్టల్తో అనేక చిక్కుముడులు.. చికాకులకు చెక్ పెట్టిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.
ఖమ్మం రూరల్, మే 29 : ఉమ్మడి రాష్ట్రం సమయంలో రైతుల బాధలు అన్నీఇన్నీ కావు. రాస్తే రామాయణం.. చెబితే భాగవతం అన్న చందంగా ఉండేవి. భూమిని సాగు చేసుకునేది ఒకరైతే, భూమి యజమానులు మరొకరు. వారసత్వంగా వచ్చిన భూమిని పంచుకునేందుకు కూడా అన్నదమ్ములు పడిన అవస్థలు అనేకం. గ్రామాల్లో భూ పంచాయితీ వస్తే చాలు దళారులు, పట్వారీలకు పండుగే. దీంతో ఎక్కడ చూసినా నిత్యం భూమికి సంబంధించిన గొడవలే దర్శనమిచ్చేవి. చివరకు ఆడపిల్లకు పసుపుకుంకుమ కింద ఇచ్చిన భూమిని సైతం ఆపదలో అమ్ముకోవాలంటే నానా ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుదీర్ఘ ఆలోచన చేసిన సీఎం కేసీఆర్ భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అనేకమంది నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఎట్టకేలకు ధరణి వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. భూ వివరాలను పూర్తిగా ఆన్లైన్ చేసుకునేందుకు, సాదాబైనామాలకు అవకాశం కల్పించడంతో లక్షలాది మంది రైతులకు ప్రయోజనం కలిగింది. నయాపైసా ఖర్చు లేకుండా కొత్త పాసు పుస్తకాలు రావడంతో దశాబ్దాల కల నెరవేరింది. అనేక చిక్కుముడులు, చికాకులకు చెక్ పడింది. ధరణి పోర్టల్ రైతులకు కొండంత ధైర్యం ఇచ్చింది.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భూ ప్రక్షాళనలో మార్పు తీసుకురాకపోవడంతో ఉమ్మడి పాలనలో సొంతభూమి కలిగిన రైతులు అనేక అగచాట్లు పడ్డారు. గ్రామస్థాయిలో పూర్తిగా పట్వారీ వ్యవస్థ ఉండడంతో ఏటా రాసే పహాణీలో చేయి తడిపితే చాలు చేతికి వచ్చింది రాసేవారు. అమ్యామ్యాలకు పూర్తిగా అలవాటుపడిన పట్వారీలు ఇష్టారీతిన రాసిన చేతిరాతలో అనేకమంది తలరాతలు మారిపోయాయి. చదువులేని రైతులు సాగు చేసుకోగా, సొమ్ము చేసుకునే దళారులు సొంత యజమానికి తెలియకుండానే పహాణీలు పుట్టించిన సందర్భాలు కోకొల్లలు. దశాబ్దాల తరబడి సొంతభూమిని సాగు చేసుకున్న వేలాదిమంది రైతులకు భూ హక్కులు కోల్పోయిన సందర్భాలు గ్రామాల్లో అనేకం. అనంతరం పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన తరువాత వీఆర్వోలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ప్రభుత్వం అనేక మందిపై నిఘాపెట్టి వేటు వేసినప్పటికీ ఉపయోగం లేదు. దీంతో నాడు భూ క్రయవిక్రయాలు రానురాను గణనీయంగా తగ్గిపోయాయి. ప్రజాప్రతినిధుల అండదండలతో గ్రామాల్లో చోటామోటా నాయకులు భూస్కాంలకు తెరలేపి వందలాది మంది రైతుల ఆత్మహత్యలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమయ్యారు. రెవెన్యూ అధికారుల బలహీనతలను ఆసరా చేసుకొని, పహాణీలలో పేరు రాయించుకోవడం, బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగ్గొట్టడంతో అనేక బ్యాంకులు నాడు ఎన్పీఏ పడిన దాఖలాలు ఉన్నాయి. ఇంటిసభ్యుల మధ్య గెట్ల వద్ద పంచాయితీ వచ్చిందంటే చాలు గ్రామాల్లో పెద్ద మనుషులకు పండుగే పండుగ. శాశ్వత పరిష్కారం వారి వద్ద లేకున్నా మాయమాటలు చెప్పి బురిడి కొట్టించేవారు. రెవెన్యూ అధికారులకు ఎదో ఒకటి చెప్పడం తాత్కాలికంగా పహాణీలో పేరు ఎక్కించడం జరిగేది. దీంతో మళ్లీ సీజన్ వచ్చిందంటే చాలు భూ పంచాయితీలు షరామామూలయ్యేవి.
ఉద్యమ సమయం నుంచే గ్రామాల్లో జరుగుతున్న భూ పంచాయితీలను స్వయంగా చూసిన నాయకుడు కేసీఆర్ అధికారంలోకి రాగానే ప్రత్యేక అధ్యయనం చేశారు. దశాబ్దాలుగా సాగుతున్న తంతుకు చెక్పెట్టి శాశ్వత పరిష్కారం కోసం చేసిన స్వీయ ఆలోచన ఫలితమే ధరణి పోర్టల్. భూముల వివరాలను పూర్తిగా ఆన్లైన్ చేయడంతో చేతిరాతలకు చెక్ పడింది. అనుభవదారుడు కాలం తీసేసి కేవలం భూమికి ఒక్కరే యజమానిని చేశారు. భూ క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేకుండా తహసీల్దార్ కార్యాలయంలోనే ఆ సౌకర్యాన్ని కల్పించడంతో భూ క్రయ విక్రయదారులకు కలిసివచ్చింది. భూ బదలాయింపు ఆరోజుకు ఆరోజే జరగాలనే నిబంధన తీసుకురావడంతో కేవలం పదిహేను నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి అవుతున్నది. అనంతరం ఇంటి వద్దకే పాసుపుస్తకం వస్తుండడంతో కొనుగోలుదారులకు పూర్తి నమ్మకం కలిగింది. ఏళ్ల తరబడి పాసు పుస్తకం కోసం వేచి చూసిన రైతులకు పాసుపుస్తకం రావడం. అనంతరం ఇతరుల నుంచి భూమి కొనుగోలు చేయాలన్నా, అమ్మకం చేపట్టాలన్నా ప్రక్రియ సులభతరం కావడంతో రైతుల సంతోషాలకు అవధులు లేకుండాపోయింది. మండల కేంద్రంలోనే అనుకున్న రోజునే క్రయవిక్రయాల ప్రక్రియ జరుగుతుండడంతో సమయాభావం కలిసివస్తున్నది. దీంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా సాగు రైతుల్లో ధరణి ధైర్యం కొట్టొచ్చినట్లు కనపడుతుండడం గమనార్హం.
భూముల గొడవలతో పాలోల్లకు పదేండ్లు దూరం కావాల్సి వచ్చింది. దాదాపుగా 30 సంవత్సరాల క్రితం మా మామయ్యకు వారసత్వంగా పది ఎకరాల భూమి రావాల్సి ఉంది. అయితే అప్పటి పట్వారీ పహాణీలో మా మామ పేరుపై ఏడు ఎకరాలు మాత్రమే రాశాడు. మిగిలిన మూడు ఎకరాలు మాత్రం మా భర్తకు సంబంధించిన పాలోళ్ల పేరుమీదనే ఉంది. దీంతో ఆ భూమిని తిరిగి మా పేరుపై వచ్చేందుకు ఎన్నో తిప్పలు పడ్డాం. ఈ గొడవల కారణంగా దగ్గరి వాళ్లకు పదేండ్లపాటు దూరం కావాల్సి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి తరువాత అంతా సద్దుమణిగింది. మా భూమి మాకు, వాళ్ల భూమి వాళ్లకు వచ్చింది. దీంతో అందరం సంతోషంగా ఉంటున్నాం. ధరణి వచ్చిన తరువాత ఎంతో ధైర్యం వచ్చింది. మా పిల్లలు సైతం భూమిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడ్డారు. మరో ఐదు ఎకరాలు కొనుగోలు చేశారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పాస్బుక్ ఇంటికి వచ్చింది. మా ఊర్లో భూముల వలన గొడవలు పెట్టుకొని విడిపోయిన అన్నదమ్ములు ఎందరో ఉన్నారు. అలాంటి కుటుంబాలు ధరణి వచ్చిన తరువాత సమస్యలు పరిష్కారం కావడంతో ఐకమత్యంగా ఉంటున్నారు. నేడు రైతులు సంతోషంగా ఉన్నారంటే కారణం సీఎం కేసీఆరే.
– అనుముల లలిత, రైతు, ముత్తగూడెం, ఖమ్మంరూరల్
నా పేరు పాయం లక్ష్మి. మాది సింగరేణి మండలం మాదారం రెవెన్యూ పరిధిలోని పాత చెన్నంగలగడ్డ గ్రామం. నా భర్త ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. తన పేరు మీద 10 ఎకరాల పట్టా భూమి ఉన్నది. ఆ భూమిని నా పేరు మీదకు విరాసత్ చేసుకునేందుకు సింగరేణి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాను. నేను పెద్దగా చదువుకోలేదు. నా భర్త ఉన్నప్పుడు పనుల కోసం ఎప్పుడూ బయటకు వెళ్లేదాన్ని కాదు. నా భర్త పేరు మీద ఉన్న భూమి నా పేరు మీదకు మారుతుందో లేదో అని భయపడ్డాను. ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తొందోనని ఆందోళన చెందా. ధరణి వల్ల సులువుగా భూమి మార్పిడి జరిగింది. అరగంటలో పట్టాదారు పాసుపుస్తకం నా చేతికి రావడం ఆనందంగా ఉంది. ధరణి పోర్టల్ వల్ల నాలాంటి ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుంది. నిజంగా ఇంత సులువుగా రిజిస్ట్రేషన్ జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
– పాయం లక్ష్మి, పాతచెన్నంగలగడ్డ,కారేపల్లి మండలం