సారపాక, మే 28 : తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులాంటివని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో పరుగులు పెట్టిస్తున్న పాలనాదక్షుడు కేసీఆర్ అని కొనియాడారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం అభివృద్ధిలోయావత్ దేశంలోనే మొ దటిస్థానంలో నిలిచిందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిలో అందరూ భాగస్వాములై కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలన్నారు. ఏజెన్సీ ఏరియాల్లో గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇప్పటికే కేసీఆర్ విద్య, వైద్యరంగాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తూ గురుకులాలతోపాటు ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరిస్తున్నారన్నారు. అంతేకాకుండా దళితబంధు, గృహలక్ష్మి పథకాలను కూడా ఆయన మాట ఇచ్చిన ప్రకారం అమలుచేసి తీరుతారన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించినట్లే యావత్ దేశంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. జిల్లాలో కొందరు రాజకీయ నాయకులు పోడుభూముల పేరుతో యాత్రలు చేస్తున్నారని, అది పోడు యాత్ర కాదని… పాడు యాత్ర అని రేగా ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ను విమర్శించే స్థాయి పొంగులేటికి లేదని, రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జిల్లాలో పోడుదారులకు పట్టా పాస్పుస్తకాలు ఇప్పటికే జిల్లా కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయన్నారు. జూన్ 24 నుంచి 30వరకు రాష్ట్రంలో గిరిజనులకు సీఎం కేసీఆర్ చేతులమీదుగా పోడు పట్టాల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటనలు చేసినా కళ్లుండి చూడలేక ఇలాంటి పోడు యాత్రల పేరుతో గిరిజనులను, ప్రజలను మభ్యపెట్టేందుకు విపక్షాలు చూస్తున్నాయని, ఇప్పటికైనా విమర్శలు మానుకుని ఇలాంటి యాత్రలకు స్వస్తి పలకాలని రేగా హితవు పలికారు.