భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల వరకే పార్టీలు అని, నియోజకవర్గ ప్రజలందరికీ పెద్దదిక్కులా ఉంటానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్లో జిల్లా, డివిజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు పారదర్శక పాలనే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నియోజకవర్గం ఎక్కువగా ఏజెన్సీలో ఉన్నదని, రిజిస్ట్రేషన్ ప్రాంతం తక్కువగా ఉండడం వల్ల చాలామంది ఇండ్లు నిర్మించుకోలేకపోతున్నారని అన్నా రు. కొత్తగూడెం అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. అధికారులు సేవ చేస్తే ప్రజలకు గుర్తుండి పోవాలన్నారు.
గతంలో తాను టూరిజం హోటల్ మంజూరుకు కృషి చేశానని, పెండింగ్లో ఉన్న బైపాస్ రోడ్లను పూర్తిచేస్తానని అన్నారు. సుజాతనగర్ మండలంలో ఒక పరిశ్రమ, పాల్వంచలో ఐటీ హబ్ ఏర్పాటుకు కృషిచేస్తానని తెలిపారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వారానికి ఒకరోజు క్యాంపు కార్యాలయంలో ‘మీ కోసం- మీ ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీలు సోనా, శాంతి, ఆర్డీవో శిరీష, జిల్లా అధికారులు పాల్గొన్నారు.