భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : వైద్యం పేరుతో పేదోళ్ల కష్టాన్ని దోచుకుంటున్న అనుమతులు లేని ఆసుపత్రులపై వైద్యశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పది రోజులుగా 195 ఆసుపత్రులను తనిఖీ చేసి ఇప్పటివరకు 21 ఆసుపత్రులను సీజ్ చేశారు. మరో 59 ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. డీఎంహెచ్వో డాక్టర్ దయానందస్వామి ఆదేశాల మేరకు 8బృందాలుగా ఆరుగురు ప్రోగాం అధికారులు, ఇద్దరు డిప్యూటీ డీఎంహెచ్వోలు, ఒక డెమో ఈ దాడుల్లో పాల్గొన్నారు.
ప్రైవేటు ఆగడాలకు కళ్లెం..
కార్పొరేట్ వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్ఎంపీల రిఫర్ ద్వారా కమీషన్లకు కక్కుర్తి పడుతున్న కొంతమంది ప్రైవేటు వైద్యులు పేదల కడుపు కొడుతున్నారు. వీరి దోపిడీకి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా పదిరోజుల నుంచి వైద్యశాలలను తనిఖీ చేస్తున్నారు. ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట, పాల్వంచ ఆసుపత్రుల్లో దాడులు నిర్వహించి నోటీసులు ఇచ్చారు. కొంతమంది రిజిస్ట్రేషన్ గడువు అయిపోయినా ఆసుపత్రి నడిపించడం, అర్హత లేని సిబ్బందిని నియమించుకుని దందాకు పాల్పడడం, హంగులతో ఉన్న ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేని దుస్థితి ఈ తనిఖీల్లో తేటతెల్లమైంది.